Bhoolaxmi goddess Temple : హైదరాబాద్ లోని భూలక్ష్మి ఆలయ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కార్పొరేటర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Bhoolaxmi goddess Temple : హైదరాబాద్ లోని రక్షాపురం ప్రాంతంలోని భూలక్ష్మి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. సీసీటీవీ ఫుటేజీని ట్రాక్ చేసిన తర్వాత ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి ఆలయంపై కార్పొరేటర్, అతని అనుచరులు పదేపదే దాడులు చేస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్లోని సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రక్షాపురం ప్రాంతంలోని భూలక్ష్మి ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని సోమవారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారనీ, ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆలయం వద్దకు భారీగా ప్రజలు, బీజేపీ శ్రేణులు తరలివచ్చి దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతి లాల్ పాటిల్ మాట్లాడుతూ... సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 11.30 నుండి 12 గంటల మధ్య ఈ సంఘటన జరిగిందని తెలిపారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పోలీసులు సీసీటీవీని ట్రాక్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారనీ, వీరిలో ఒకరు ప్రధాన నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు వ్యక్తుల వివరాలను సేకరించామని చెప్పారు. "విధ్వంసానికి బాధ్యులైన వారందరినీ పట్టుకుంటాం. ప్రత్యక్షంగా బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దాడి వెనుక రాజకీయ ఉద్దేశాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు" అని కూడా తెలిపారు.
ఈ ఘటన చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం రియాసత్నగర్ డివిజన్, రక్షాపురం కాలనీలోని భూలక్ష్మి ఆలయంలో జరిగినట్లు బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్రెడ్డి తెలిపారు. భూలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారనీ, స్థానిక కార్పొరేటర్, ఆయనకు చెందిన సంబంధికులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటన జరగడం ఇదే తొలిసారి కాదనీ, గత ఐదేళ్లుగా జరుగుతున్నదని గుర్తుచేశారు. ఈ ఆలయం పోలీస్ స్టేషన్ నుండి కేవలం 50 చదరపు గజాల దూరంలో ఉందని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు ప్రధాన నిందితులు కారనీ, ఈ దాడివెనుక ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.