దారుణం : భర్తతో కలిసి తమ్ముడి హత్య... అక్క, బావ అరెస్ట్...
సొంత అక్కా, బావలే తమ్ముడ్ని కడతేర్చిన దారుణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 28న జరిగిన హత్యకేసులో హతుడి అక్కా, బావలే నిందితులని పోలీసులు తేల్చారు. తరచుగా మద్యం తాగి వేధిస్తుండడమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
సొంత అక్కా, బావలే తమ్ముడ్ని కడతేర్చిన దారుణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 28న జరిగిన హత్యకేసులో హతుడి అక్కా, బావలే నిందితులని పోలీసులు తేల్చారు. తరచుగా మద్యం తాగి వేధిస్తుండడమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇన్స్పెక్టర్ శంకర్, ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ పుకట్నగర్కు చెందిన పెయింటర్ దినేష్సింగ్, అతని సోదరుడు భరత్సింగ్ తిరుపతిలో పెయింటింగ్ పని చేసేవారు. వీరి అక్కాబావ నీతు, సూర్యప్రకాష్లు వెంకటేష్నగర్లో ఉంటున్నారు.
లాక్డౌన్ వల్ల అక్కడ పని లేకపోవడంతో హైదరాబాద్ కు వచ్చిన దినేశ్, భరత్సింగ్లు తరచూ మద్యం తాగి అక్క ఇంటికి వెళ్లేవాళ్లు. తాము దాచుకున్న డబ్బుల కోసం గొడవపడేవారు. ఎప్పటిలాగే గతనెల 28న రాత్రి ఇరువురూ మద్యం సేవించి అక్క ఇంటికి వెళ్లారు. తిరుపతి వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగారు.
సరేనన్న అక్క,బావలు రూ.100 ఇవ్వడంతో మళ్లీ మద్యం తాగారు. దినేశ్ అక్క ఇంట్లో పడుకోగా భరత్సింగ్ వెళ్లిపోయాడు. వీరి గొడవలతో ఎప్పటినుంచో విసిగిపోయి ఉన్న అక్క, బావ కలిసి నిద్రపోతున్న దినేశ్ ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి పెట్టి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు.
ఆ తరువాత అర్థరాత్రి ద్విచక్రవాహనంపై దినేశ్ మృతదేహాన్ని పురానాపూల్, ఇక్బాల్గంజ్ మీదుగా కల్లుకంపౌండ్ వద్దకు తీసుకెళ్లి దాని వెనుక భాగంలో పడేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు హతుడి అక్కాబావలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. సోమవారం రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.