మద్యం డోర్ డెలివరీ చేస్తామని.. రూ.70వేలు లూటీ..!
జూన్ 20 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమలు ఉండటంతో.. రాత్రి సమయంలో... మద్యం దుకాణాలు మూసివేశారు.
సైబర్ నేరస్థులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని.. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఓ ప్రైవేటు ఉద్యోగి.. ఆన్ లైన్ లో మద్యం ఆర్డర్ చేశాడు. మద్యం ఇంటికే డెలివరీ అవుతుంది కదా అని అతను చేసిన పని ఇరకాటంలో పడేసింది. అతని ఓటీపీ సహాయంతో.. ఆయన ఎకౌంట్ నుంచి దాదాపు రూ.70వేలు లూటీ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాకు చెందిన అనురాగ్ ప్రశాంత్... పని నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఓ స్టార్ హోటల్ లో గది తీసుకొని అక్కడే ఉంటున్నాడు. కాగా.. జూన్ 20 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమలు ఉండటంతో.. రాత్రి సమయంలో... మద్యం దుకాణాలు మూసివేశారు.
దీంతో.. అతను మద్యం కోసం.. ఆన్ లైన్ లో సెర్చ్ చేశాడు. కాగా.. ఆయనకు ఆన్ లైన్ లో ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. దీంతో.. ఆయన వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేసి మద్యం ఆర్డర్ చేశారు.
మద్యం పంపిణీ చేయడానికి.. ముందుగానే డబ్బులు చెల్లించాలని వారు కోరారు. దీంతో.. అనురాగ్ వారు చెప్పిన విధంగా డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో సైబర్ నేరస్థుడు.. అనురాగ్ క్రెడిట్ కార్డ్ డీటైల్స్ తీసుకొని.. ఓటీపీ కూడా అడిగాడు. మోసం గురించి తెలియని అనురాగ్.. వారు అడిగినట్లు ఓటీపీ కూడా చెప్పేశాడు.
దాని సహాయంతో.. నేరస్థులు.. అతని ఖాతా నుంచి రూ.70 వేలు కాజేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.