గగనం సినిమా ఎఫెక్ట్: ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన టెన్త్ విద్యార్ధి
హైద్రాబాద్ మీర్పేటలో కిడ్నాప్కు గురైన ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ ను నాలుగు గంటల్లో రాచకొండ పోలీసులు చేధించారు.
హైదరాబాద్: గగనం సినిమాలో ఉగ్రవాదులు ఏ రకంగా బెదిరింపులకు పాల్పడుతారో చూసిన బాల నేరస్తుడు హైద్రాబాద్ మీర్పేటలో ఏడేళ్ల బాలుడిని కూడ కిడ్నాప్ చేశాడు. నాలుగు గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీని రాచకొండ పోలీసులు చేధించారు. ఈ కిడ్నాప్ మిస్టరీని చేధించిన పోలీసులను రాచకొడ సీపీ మహేష్ భగవత్ అభినందించారు.
హైద్రాబాద్ మీర్పేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకును కిడ్నాప్ చేశాడు బాల నేరస్తుడు. ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి బాల నేరస్తుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూ. 3లక్షలు డిమాండ్ చేశారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ కిడ్నాప్ మిస్టరీకి సంబంధించిన విషయమై సోమవారం నాడు మీడియాకు వివరించారు.
హైద్రాబాద్ మీర్పేటలోని పీఎస్ఆర్ నగర్కు చెందిన జి.రాజు గచ్చిబౌలిలోని బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు. ఆదివారం నాడు రాజు కొడుకు అర్జున్ తన ఇంటికి సమీపంలో ఆడుకొంటున్నాడు.
అయితే ఆ సమయంలో రాజుకు ఓ ఆగంతకుడి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అర్జున్ గురించి అడిగాడు. వెంటనే ఆగంతకుడు మరోసారి పోన్ చేసే సమయానికి అర్జున్ అదృశ్యమైన విషయాన్ని రాజు గుర్తించాడు.
అర్జున్ తన వద్దే ఉన్నాడని ఆగంతకుడు పోన్ చేశాడు. అర్జున్ సురక్షితంగా అప్పజెప్పాలంటే డబ్బులు కావాలని ఆగంతకుడు రాజును డిమాండ్ చేశాడు.
రాజు వెంటనే మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే సమయంలో రాజుకు కిడ్నాపర్ ఫోన్ చేశాడు. తనకు రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
నిందితుడికి ఆన్లైన్లో రూ. 25వేలను ట్రాన్స్ఫర్ చేస్తానని సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజు చెప్పాడు. మిగిలిన నగదును చెక్ రూపంలో చెల్లిస్తానని చెప్పాడు.
అయితే మొత్తం రూ. 3 లక్షలను అల్మాస్గూడలో తీసుకొనేందుకుగాను కిడ్నాపర్ అంగీకరించాడు. అయితే కిడ్నాపర్ ను పట్టుకొనేందుకు పోలీసులు మఫ్టీలో మాటు వేశారు. అల్మాస్గూడలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద పోలీసులు కిడ్నాపర్ కోసం కాపు కాశారు.
అయితే కిడ్నాప్ గురించి పోలీసులకు గానీ ఇతరులకు సమాచారం ఇవ్వకూడదని కిడ్నాపర్ రాజును హెచ్చరించాడు. అంతేకాదు ప్రతి 30 నిమిషాలకు ఓసారి ఫోన్ చేసి తనకు డబ్బులను అందించాలని కిడ్నాపర్ డిమాండ్ చేశాడు.
డబ్బులు తీసుకొనేందుకు వచ్చిన కిడ్నాపర్ ను పోలీసుల అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ మీర్పేట స్కూల్లో 10వ తరగతి చదవుతున్నాడు. అతని వయస్సు 17 ఏళ్లు. గతంలో కూడ నిందితుడు ఓ ఇంట్లో రూ. లక్ష దొంగతనం చేశాడు.
ఈ రకంగా సంపాదించిన డబ్బులను నిందితుడు జల్సాల కోసం ఖర్చు చేసేవాడు. నిందితుడి తల్లిదండ్రులు టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.సినిమాల్లో చూపించినట్టుగానే నిందితుడు కిడ్నాప్కు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు.