పద్మశ్రీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: జయరాం హత్యపై హైదరాబాద్ సిపి
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై పోలీసు ఉన్నతాదికారులు గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: హత్యకు గురైన ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. జయరామ్ హత్య కేసు ఏపీ పోలీసుల నుంచి హైదరాబాద్కు బదిలీ అయ్యింది. ఇటీవల హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీసులకు పద్మ శ్రీ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై పోలీసు ఉన్నతాదికారులు గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి జయరామ్ హత్యకేసు డైరీని అందుకున్నామని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ను నియమించామని ఆయన చెప్పారు. పద్మ శ్రీ ఫిర్యాదు ఆధారంగా స్టేట్మెంట్ రికార్డు చేసి కొత్త కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.
పద్మశ్రీ ఫిర్యాదులో ఉన్నవారందర్నీ విచారిస్తామని సీపీ మీడియాకు వివరించారు. మాపై పద్మ శ్రీకి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అంజనీకుమార్ చెప్పుకొచ్చారు.