హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి మృతి
మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి మృతి పట్ల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్కుమార్లు సంతాపం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని నివాసంలో వుండగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సాయిరెడ్డి మృతి పట్ల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్కుమార్లు సంతాపం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకకు చెందిన సాయిరెడ్డి ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు. కళాశాల స్థాయి నుంచే నాయకుడిగా ఎదిగిన ఆయన... కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనదైన శైలిలో పాల్గొన్నారు.
1972లో జూపాక సర్పంచ్ గా సాయిరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత 1974, 1981లో వరుసగా రెండుసార్లు హుజురాబాద్ సమితి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1989లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా హుజురాబాద్ నుండి గెలిచారు. ఆ తరువాత కమలాపూర్, హుజురాబాద్ ల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సాయిరెడ్డి 2018లో హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.