Huzurabad Bypoll: మంత్రులు హరీష్, గంగులను సైతం వదలని పోలీసులు
హుజురాబాద్ ఉపఎన్నిక నేపద్యంలో నియోజవర్గాన్ని అష్టదిగ్బందనం చేసిన పోలీసులు మంత్రులను సైతం వదిలిపెట్టకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా, రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఇతర ప్రాంతాలతో కలిపే రోడ్లన్నింటిని దిగ్భందం చేస్తూ చెక్ పోస్టులను ఏర్పాటుచేసారు. ఇక్కడ ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీ చేస్తున్నారు. చివరకు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ను కూడా వదిలిపెట్టడంలో లేదు.
తాజాగా Huzurabad Bypoll సందర్భంగా ప్రచారానికి వెళుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు, పౌరసరఫరా మంత్రి గంగుల కమలాకర్ వాహనాలను ఆపి తనిఖీ చేశారు పోలీసులు. సింగపురం వద్ద Harish Rao కాన్వాయ్ ని ఆపిన పోలీసులు తనిఖీ నిర్వహించారు. స్వయంగా హరీష్ ప్రయాణించే వాహనాన్ని కూడా వదిలిపెట్టకుండా తనిఖీ చేసినతర్వాతే వదిలిపెట్టారు పోలీసులు.
ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ కు కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఉపఎన్నిక ప్రచారానికి వెళుతున్న మంత్రి Gangula Kamalakar కాన్వాయ్ ను హుజురాబాద్ పట్టణ శివారులో ఆపారు. కాన్వాయ్ లోని వాహనాలతో పాటు మంత్రి ప్రయాణించే వాహనాన్ని కూడా చెక్ చేసి పంపించారు.
వీడియో
పోలీసుల తనిఖీ ఎలాంటి అడ్డంకి చెప్పకుండా ముగిసేవరకు ఓపికగా వేచిచూసారు మంత్రి గంగుల. అంతేకాదు ప్రజాప్రతినిధులందరూ విదినిర్వహణలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి అన్నివిదాలుగా సహకారం అందించాలని... వారి విధుల్ని సజావుగా చేసుకునేలా చూడాలని మంత్రి గంగుల సూచించారు.
READ MORE Huzurabad Bypoll: ఈటలకు షాక్... బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరిన హుజురాబాద్ కౌన్సిలర్
రాష్ట్రంలో అధికారపార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అదికారంలో వున్న బిజెపి హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపీలను రంగంలోకి దింపతే టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపింది. అయితే ఈ ఉపఎన్నికలో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి భారీగా డబ్బులు పంచడానికి సిద్దమైనట్లు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో వుండటంతో ఎలాంటి అక్రమాలు జరక్కుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత శుక్రవారం(అక్టోబర్ 1వ తేదీన) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇదేరోజు నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.