మొసలి కన్నీరు, తీయటి మాటలకు ఆగం కావద్దు: హుజురాబాద్ మహిళలకు హరీష్ సూచన
పని చేసే వాళ్లు కావాలా....మాటలు చెప్పేవాళ్లు కావాలా అని హుజురాబాద్ మహిళలను అడిగారు మంత్రి హరీష్ రావు.కేసీఆర్ ను బలపర్చాలని.... ఎండమావుల వెనుక పరుగెత్తవద్దని హరీష్ సూచించారు.
కరీంనగర్: పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు దండగ అని ఈటల రాజేందర్ అంటున్నారు... ఈ పథకాలు ఉండాలా...వద్దా... మీరే చెప్పండి అని హుజురాబాద్ మహిళలను అడిగారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఈ పథకాలు ఇచ్చే వాళ్లు కావాలా...వద్దనే వాళ్లు కావాలా ఆలోచించండని సూచించారు. మొసలి కన్నీరు, తీయటి మాటలకు ఆగం కావద్దని మహిళలను కోరారు మంత్రి హరీష్.
హుజూరాబాద్ మార్కెట్ యార్డులో మహిళా సంఘాల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...హుజూరాబాద్ లో 19 గ్రామాల మహిళలకు, టౌన్ పరిధిలో 30 వార్డుల మహిళలకు వడ్డీలేని రుణం ఇస్తున్నామన్నారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజి, వడ్డీ లేని రుణాలు ఇలా అన్నీ కలిపి రూ.20 కోట్లు అక్కా చెళ్లెల్లకు ఇస్తున్నామని... ఇలా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని మహిళలకు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు.
''సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాల్లో మహిళా భవనాలున్నాయి. మరి హుజూరాబాద్ లో ఎందుకు నిర్మించలేదు. పదహారు గ్రామాల్లో 3 కోట్ల పది లక్షల నిధులతో అన్ని వసతులతో కూడిన మహిళా భవననాలను మంజూరు చేస్తున్నాం. మూడు నెలల్లో ఒక్కో గ్రామంలో రూ.20లక్షల చొప్పున వెచ్చించి మహిళా భవనాలు పూర్తిచేసి ఇస్తాం. అలాగే అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి, ఆ మహిళలకు 2016 రూపాయల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. త్వరలోనే మీకు అందజేస్తాం'' '' అని హామీ ఇచ్చారు.
''కేసీఆర్ నిరాహార దీక్ష, మొండి పట్టుదలతో మనమంతా ఒక్కటై కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ ఏడేళ్లలో తెలంగాణ మంచిగ చేసుకున్నాం. ఆనాడు వ్యవసాయానికి కరెంట్ ఉండేది కాదు. కాలిపోయే మోర్టార్లు, ట్రాన్స్ ఫార్మర్లు వుండేవి. కేసీఆర్ వచ్చాక ఇంటిలో 24 గంటల కరెంట్, బాయికాడ నాణ్యమైన విద్యుత్ వస్తోంది'' అని హరీష్ అన్నారు.
''పంట రుణాల కోసం నాడు బ్యాంకుల చుట్టూ నెలల తరబడి రైతులు తిరిగే పరిస్థితి వుండేది. ఇవాళ రైతు కాలు గడప బయట పెట్టకుండానే బ్యాంకుల్లో ఏడాదికి ఎకరానికి పది వేలు చొప్పున జమ అవుతోంది. ఎస్సారెస్పీ కాలువల్లో ఆనాడు నీరు వచ్చేది కాదు. పంటలు ఎండిపోయేవి. ఇవాళ కాళేశ్వరం నీరుతో కాలువలు నిండుగా పారుతున్నాయి. ఎరువులు, విత్తనాలకు తిప్పలు లేవు. కరెంట్ ఉచితం, నీటి తీరువా రద్దు, సాగు నీరు ఉచితం. పండిన కాడికి పంటను కొన్నాం. రానున్న రోజుల్లో కొనుగోలు సెంటర్స్ ను బలోపేతం చేస్తాం. మినీ గోడౌన్లు, సీసీ ఫ్లాట్ ఫాంలు నిర్మిస్తాం'' అని ప్రకటించారు.
read more Huzurabad Bypoll:ఎవరిది తప్పయితే వారు ముక్కు నేలకు రాద్దాం... సిద్దమేనా హరీష్: ఈటల సవాల్
''పెన్షన్ ఆనాడు రూ.200లు ఇస్తే దాన్ని రూ.2016 రూ కు పెంచడం జరిగింది. హుజూరాబాద్ లో 38వేలమందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎవరైనా 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? రానున్న రోజుల్లో 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తాం. వారితో కలిపితే ఒక్క హుజూరాబాద్ లోనే 43 వేలమందికి పెన్షన్ వస్తుంది'' అని హరీష్ వెల్లడించారు.
''ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు. ఆత్మ గౌరవం అంటే ఆర్థిక స్వావలంబన,. తన కాళ్ల మీద తాము నిలబడటం. పేదలకు ఉండటానికి ఇళ్లు, కడుపునిండా తిండి, నాణ్యమైన చదువుతో గౌరవంగా బతకడమే ఆత్మగౌరవం'' అన్నారు.
''హుజురాబాద్ కు సీఎం 4 వేల ఇళ్లు ఇచ్చారు. బాన్సువాడ , మహబూబ్నగర్, సిద్దిపేట, ఖమ్మం ప్రాంతాలకు ఇళ్లు మంజూరు అయ్యాయి. సిద్దిపేటలో నేను , బాన్సువాడలో పోచారం, మహబూబ్నగర్ లో శ్రీనివాస్ గౌడ్ ఇళ్లు నిర్మించారు. ఇక్కడ ఎందుకు నిర్మించ లేదు. ఎందుకు రాజేందర్ పట్టించుకోలేదు. ఈ ఇళ్లు కంట్టించే బాధ్యత నాది. నాలుగు వేల ఇళ్లు వెంటనే పూర్తి చేయిస్తా. స్వంత జాగా ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్బులు ఇస్తాం'' అని హామీ ఇచ్చారు.
''రూ.50వేల లోపు రుణం ఉన్న ఆరు లక్షల మంది రైతులకు రుణ మాఫీ ఈ నెల 15 నుండి కానుంది. 2008 కోట్లు రైతుల అక్కౌంట్లలో జమ కానున్నాయి. మేం చెప్పిన వన్నీ చేస్తున్నాం.టీఆర్ఎస్ పేదల సంక్షేమం కోసం పని చేస్తుంది'' అన్నారు.
''కేంద్రం లో బీజేపీ డిజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచింది. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలనడ్జి విరుస్తోంది. అరవై రూపాయల డిజీల్ను 104 రూపాయలకు పెంచి రైతులపై భారం వేస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఎకరానికి ఐదు వేల రూపాయల రైతు బంధు కేసీఆర్ ఇస్తుంటే. ..గతంలోఎకరంలోట్రాక్టర్ పనికి 3వేలు ఖర్చయ్యేవి. డిజీల్ ధరలు పెంచడంతో ఇప్పుడు ఎకరానికి ట్రాక్టర్ ఖర్చు 5వేలు వస్తోంది. రైతులకు మేం ఇచ్చేడబ్బులను బీజేపీ డిజిల్ ధరలు పెంచి రైతుకిచ్చిన డబ్బులు లాక్కోంటోంది'' అన్నారు.
read more హుజూరాబాద్ బైపోల్: గెలుపొటములను నిర్ణయించేది ఆ ఓటర్లే
''ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్స్లో లక్షా 30 వేల మంది చదువుతుంటే..నేడు మూడు లక్షల నలభై వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను పొందుతున్నారు'' అన్నారు.
''ఇలా పని చేసే వాళ్లు కావాలా....మాటలు చెప్పేవాళ్లు కావాలా. ఇంకా రెండున్నరేళ్లు సీఎంగా కేసీఆర్ ఉంటారు. ఆయన ఆశీర్వాదంతో అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటా. కేసీఆర్ గారిని బలపర్చండి. ఎండమావుల వెనుక పరుగెత్తకండి'' అని మహిళలకు సూచించారు హరీష్ రావు.