హుజురాబాద్ ఉపఎన్నికల్లో న్యాయం, ధర్మాన పక్షాన నిలవాలని... వ్యక్తి కోసం కాకుండా వ్యవస్థకు లాభం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచించారు మంత్రి హరీష్ రావు. 

కరీంనగర్: త్వరలో జరగనున్న ఎన్నికలో వ్యక్తులు, పార్టీలను కాకుండా ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్ ప్రజలకు సూచించారు. ఈ ఉపఎన్నిక ఈటల రాజేందర్ స్వార్థం వల్ల వచ్చిందన్నారు. హుజూరాబాద్ ను జిల్లా చేయాలని లేదా huzurabad కు ఓ మెడికల్ కాలేజి కావాలని ఈటల రాజీనామా చేశారా? కేవలం స్వలాభం కోసమే ఈటల రాజీనామా చేశారని హరీష్ ఆరోపించారు. 

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధర్మరాజేపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా మంత్రి harish rao ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వ్యక్తి లాభం ముఖ్యమా... వ్యవస్థ లాభం ముఖ్యమా అన్నది ఆలోచించి ఓటేయాలని సూచించారు.

''eatala rajender ఎందుకు బీజేపీలో‌ చేరారు? bjp ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారు? గ్యాస్‌ సిలిండర్ ధరపెంచి ప్రజలకు బీజేపీ వాతలు పెడుతోంది. నిన్న అక్కాచెళ్లెళ్లు బతుకమ్మల మధ్య సిలిండర్లు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసిన బీజేపీ నిన్న మరో 15 రూపాయలు పెంచింది. వారం వారం బీజేపీ గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుతోంది. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేద్దామా?'' అని హరీష్ ఓటర్లను ప్రశ్నించారు. 

''హుజురాబాద్ లో ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ నన్ను చూసే జరుగుతున్నాయని ఈటల రాజేందర్ చెబుతున్నాడు. మరి కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల విద్యుత్ ఎవరిని చూసి కేసీఆర్ ఇచ్చారు?'' అని ఈటలను ప్రశ్నించారు. 

read more Huzurabad Bypoll: బిజెపిలో కలకలం... హుజురాబాద్ అధ్యక్షుడిపై వేటు

''కరోనా సమయంలోను సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి మరీ రైతులకు రైతు బంధు ఇచ్చారు... రెండు వేల పెన్షన్ ఆపలేదు. కార్డు దారులకు రూ.1500 తో పాటు బియ్యం, పప్పులు కరోనా సమయంలో అందజేశాం'' అని తెలిపారు. 

''బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్ల‌ పెళ్లికి‌ లక్ష రూపాయల సాయం చేస్తున్నారా? కళ్యాణ లక్ష్మి ఉండాలా వద్దా... రాజేందర్ కళ్యాణ లక్ష్మి వద్దు అంటున్నారు. మరి మీరేం అంటారు. ఆరు సార్లు ఈటలను గెలిపించారు అయినా ఒక్క‌ ఇళ్లు ‌‌కట్ట‌లేదు. గెల్లుని ఒక్కసారి ‌గెలిపించండి... ‌డబుల్ బెడ్‌రూం ఇల్లు‌కట్టిస్తాం'' అని స్పష్టం చేశారు. 

''మేం గెలిస్తే విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి రూ.15 లక్షల రూపాయలు మీ అక్కౌంట్లలో వేస్తామని బీజేపీ వాళ్లు చెప్పారు. ఒక్క రూపాయి అయినా వేసారా.. ? ధరలు పెంచి వాతలు పెట్టడం...సబ్సిడీల్లో కోతలు విధించడం తప్ప కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు'' అని మంత్రి హరీష్ మండిపడ్డారు.