Huzurabad bypoll: 'ఆ రెండు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్'
కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. అక్టోబర్ 30న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.
హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ (huzurabad bypoll) స్థానానికి జరిగే ఉప ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ (karimnagar), హన్మకొండ (hanmakonda)జిల్లాల్లో ఇవాళ్టి నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ (shashank goyal) చెప్పారు.
మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని శశాంక్ గోయల్ కోరారు.
ఈవీఎంల మొదటి దశ తనిఖీ పూర్తైందన్నారు.ఉఫ ఎన్నికకు 305 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా శశాంక్ గోయల్ తెలిపారు.అవసరమైతే పోలింగ్ కేంద్రాలను పెంచుతామని ఆయన చెప్పారు.ఇప్పటివరకు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,36,269 మంది ఓటర్లున్నారన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఇంకా ఫైనల్ కాలేదు.