Huzurabad Bypoll: ఊర్లకు ఊర్లే బార్లుగా...నోట్ల కట్టలతో ఓట్ల బేరం: టీఆర్ఎస్ పై ఈటల ఆరోపణ
హుజురాబాద్ ఉపఎన్నిక చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు ప్రలోబాలకు తెరతీసారని మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక చివరి దశకు చేరకుంది. రేపటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ తెరవెనుక కుట్రలు కుతంత్రాలకు తెరతీసిందని మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇప్పటికే వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ ఓటు హక్కును శాసించే స్థాయికి టీఆర్ఎస్ చేరుకుందని ఈటల ఆందోళన వ్యక్తం చేసారు.
''ప్రలోభాలు, లిక్కర్ ప్రవాహం, నోట్ల కట్టలు, కుట్రలు కుతంత్రాల పర్వం హుజురాబాద్ లో కొనసాగుతోంది. ఓట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారు. గత ఐదు నెలల 26 రోజులుగా ఇదే కొనసాగుతుంది. TRS ఆగడాలను అడ్డుకోకుంటే ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అవుతాయి'' అని eatala rajender ఆరోపించారు.
''huzurabad లో ఓటుహక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్, తాత్కాలికంగా పని చేసే వారికీ టీఆర్ఎస్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. TRS కి ఓటు వేయకపోతే ఉద్యోగం తీసివెస్తాం అని బెదిరిస్తున్నారట. పర్మినెంట్ ఉద్యోగులను బదిలీల పేరిట చేస్తున్నారు'' అని పేర్కొన్నారు.
''ఎన్నో ప్రతిబంధకాల మధ్య హుజూరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారు. అయినప్పటికి 30న మా ఆత్మను ఆవిష్కరిస్తామని... మా గుండెల్లో ఉన్న మీకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు'' అని ఈటల తెలిపారు.
''నా మొఖం అసెంబ్లీ లో కనబడద్దని CM KCR శపథం చేసాడు. నా కుటుంబం పై దాడి చేసి ఎంతగానో వేదించారు. హుజురాబాద్ ప్రజలు దీవిస్తే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఓటు కోసం అమాయక ప్రజలతో ప్రమాణం చేయిస్తున్నారు. డబ్బులిచ్చినా,ఏమిచ్చినా తీసుకోండి కానీ ప్రమాణం చేయకండి. ఎంత మంది దాడి చేసినా నాకు చెదరని విశ్వాసాన్ని మీరు అందించారు. 30 తేదీ తరువాత ఇప్పుడున్న నాయకులు ఎవరూ రారు. కానీ నేను మీవెంటే ఉంటా'' అని ఈటల అన్నారు.
''పత్రికా యాజమాన్యాలు, టీవీ ఛానళ్ల ఓనర్లు, ప్రజాస్వామ్య వాదులారా... హుజూరాబాద్ వైపు చూడండి. ఇక్కడ జరిగేది మామూలు విషయం కాదు. ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా ఎంత అయినా ఖర్చు పెట్టి ఈటల రాజేందర్ ను ఓడించాలని చూస్తున్నారు. ఊరుకు ఊర్లు బార్లు గా మార్చారు. ఇప్పుడు ఓటుకు 20 వేల రూపాయలు పంచుతారట. వీటన్నింటిని నిలువరించకపోతే రాబోయేకాలంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అవుతుంది. పౌరుల స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులను భంగం కలుగుతుంది కాబట్టి ఆలోచన చేయాలి'' అని ఈటల సూచించారు.
బుధవారం సాయంత్రం వరకే ప్రచారానికి సమయం వుండటంతో హుజురాబాద్ అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48గంటలు ముందుగానే ప్రచారానికి తెరపడనుంది. వచ్చే నెల నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.