Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: దళిత బంధుని ఆపాలని నేను లేఖ రాసినట్టు నిరూపిస్తారా?.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బండి

తెలంగాణ  బీజేపీ  అధ్యక్షుడు  బండి సంజయ్ (Bandi Sanjay)  టీఆర్‌ఎస్‌పై తీవ్ర  స్థాయిలో  విరుచుకుపడ్డారు.  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం నిలిపివేతపై టీఆర్‌ఎస్ పార్టీ  అబద్దాలు చెప్తొందని  ఆరోపించారు.  

Huzurabad Bypoll bandi sanjay Fires on CM Kcr Over ec order on dalit bandhu
Author
Huzurabad, First Published Oct 20, 2021, 5:10 PM IST

హుజూరాబాద్  నియోజవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్   సమీపిస్తున్న  వేళ.. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి.  ముఖ్యంగా  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే  ఉన్నాయి.  తాజాగా తెలంగాణ  బీజేపీ  అధ్యక్షుడు  బండి సంజయ్ (Bandi Sanjay)  టీఆర్‌ఎస్‌పై తీవ్ర  స్థాయిలో  విరుచుకుపడ్డారు.  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం నిలిపివేతపై టీఆర్‌ఎస్ పార్టీ  అబద్దాలు చెప్తొందని  ఆరోపించారు.  టీఆర్‌ఎస్  వాళ్లే  లేఖ రాసి.. బీజేపీపై  నెపం వేస్తున్నారని అన్నారు. హుజురాబాద్‌లో బుధవారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ  సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..  దళితబంధు ఆపాలని తాను లేఖ రాసినట్లు సీఎం  కేసీఆర్ నిరూపిస్తారా అని ప్రశ్నించారు.  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి సిద్ధమా అంటూ  సవాలు  విసిరారు. 

‘ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతారు. Dalit bandhu నిధులు ఖాతాల్లో వేసి విత్‌డ్రా చేసుకోనివ్వలేదు. దళితబంధు నిధులు ఇవ్వాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది’అని  బండి  సంజయ్  అన్నారు. నాగార్జున సాగర్ ఉప  ఎన్నిక తర్వాత  గొర్రెల  పంపిణీ  పథకం ఆగిపోయిందని చెప్పారు. గ్రామాల్లో చేపట్టే  ప్రతి పనికి కేంద్ర ప్రభుత్వం  నిధులు  ఇస్తుందని సంజయ్ అన్నారు. 

తెలంగాణ  ప్రభుత్వం  హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని  పైలట్  ప్రాజెక్టుగా  అమలు  చేస్తున్న  సంగతి తెలిసిందే. అయితే దళిత బంధు పథకానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు బ్రేక్ వేసింది. ఆ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నిక ముగిసే వరకు దళితబంధు పథకం అమలును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ పథకం కింద అన్ని దశలలోని నగదు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇందుకు మీరంటే మీరని రాష్ట్రంలో అధికారంలో వున్న TRS, కేంద్రంలో అధికారంలో వున్న BJP ఆరోపించుకుంటున్నాయి. 

Also read: యాదాద్రి ఆల‌యానికి వైసీపీ జ‌డ్పీటీసీ కిలో బంగారం విరాళం.. కేసీఆర్‌కు థాంక్స్

అయితే దళిత బంధు విషయంలో ఈసీ ఆదేశాలపై స్పందించిన  కేసీఆర్ (CM KCR).. దళిత బంధుపై ఈసీ తన పరిధిని అతిక్రమించిందని వ్యాఖ్యానించారు. దళిత బంధు అర్హులు ఆందోళన చెందవద్దని అన్నారు. ఉప ఎన్నిక పూర్తైన  వెంటనే దళిత బంధు తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios