భాగ్యనగరాన్ని ముంచెత్తిన వర్షాలు: నిండిన హుస్సేన్ సాగర్
హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత హుస్సేన్సాగర్ నీటిమట్టంతో ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి హుస్సేన్ సాగర్ పొంగుపొర్లుతుంది. భారీగా వర్షం నీరు వచ్చి చేరడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీరు వచ్చి చేరడంతో హుస్సేన్సాగర్లో నీటి మట్టం ఎఫ్టీఎల్ స్థాయిని దాటింది.
హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత హుస్సేన్సాగర్ నీటిమట్టంతో ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు హుస్సేన్ సాగర్ కు దారి తీసే నాలాలన్నీ పొంగి పొర్లు తున్నాయి. నాలాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగోల్ లో నాలాలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. అయితే అందులో ఒకరు ప్రాణాలతో బయటపడగా ఒకరు మృతి చెందారు.
హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపించడంతో దాన్ని తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాంతో నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది.