వివాహమై 30 ఏళ్లు.. ఇప్పుడు రెండో పెళ్లి: మొదటి భార్యను గెంటేసిన భర్త, ఆస్తి పంచాలంటూ బాధితురాలి నిరసన
భర్త మరో మహిళను వివాహం చేసుకుని తనను ఇంటిలోంచి వెళ్లగొట్టాడని.. తన బిడ్డతో పాటు జీవించాలంటే తనకు ఆస్తి పంచాల్సిందేనంటూ ఓ వివాహిత పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.
భర్త మరో మహిళను వివాహం చేసుకుని తనను ఇంటిలోంచి వెళ్లగొట్టాడని.. తన బిడ్డతో పాటు జీవించాలంటే తనకు ఆస్తి పంచాల్సిందేనంటూ ఓ వివాహిత పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా మాధారం గ్రామానికి చెందిన చిలక సాంబశివరావుకు 30 ఏళ్ల క్రితం సీతమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కృష్ణవేణి ఉంది. ఈ క్రమంలో సాంబశివరావు ఇటీవల మరో మహిళను రెండో వివాహం చేసుకొని, తనను, తన కూతురిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని బాధితురాలు వాపోయింది. ఇంట్లో గానీ, వ్యవసాయ భూమిలో గానీ ఆస్థి పంచి ఇవ్వలేదని, ఈ విషయమై పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని సీతమ్మ ఆరోపించింది.
దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సీతమ్మ తన భర్త నుంచి ఆస్థి పంచి ఇవ్వాలని.. పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఇది సివిల్ మ్యాటర్ అని కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్లు పోలీసులు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా సీతమ్మ పోలీసు స్టేషన్కు వస్తూ.. ఎస్ఐలు మారినప్పుడల్లా ఇదే విషయంపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసిందని, కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీతమ్మకు చెప్పామని వెల్లడించారు.