పెళ్లైన రెండునెలలకే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త..
హనుమకొండలో ఓ వ్యక్తి అనుమానంతో భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లై రెండు నెలలు కూడా గడవకముందే జరిగిన ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
హనుమకొండ : అనుమానం పెనుభూతమై ఓ కొత్త జంటను బలితీసుకుంది. పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే రెండు జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త పురుగుల మందు తాగి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్ (26)కు ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేటకు చెందిన నాగేశ్వరరావు శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె పుష్పలీల(19)తో జూన్ 15న వివాహం అయింది. హరీష్ కు సోదరుడు, అక్క ఉన్నారు. తల్లి పదేళ్ల కిందటే మృతి చెందింది. తండ్రి కూలీ పనులు పనిచేస్తుంటాడు.
పెళ్లయినప్పటి నుంచి పుష్పలీలపై అనుమానం పెంచుకున్న హరీష్ శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో వారికి ఎందుకు చెప్పావ్ అంటూ ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి వారిని కలిపారు. కాగా పుష్పలీల ఫోన్ లో తన తల్లిదండ్రులతో మాట్లాడితే ఇంక ఎవరితోనో మాట్లాడుతుంది.. అని అనుమానం పెంచుకున్న హరీష్ వేధింపులు ఇంకా ఎక్కువ చేశాడు.
సోమవారం ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన హరీష్ రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆమె నిద్రకుపక్రమించిన సమయంలో గొడ్డలతో మెడపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత బయటకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగు వారు గమనించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. కుమార్తెను కడసారి చూసేందుకు వద్దామన్నా ఆ నిరుపేద తల్లిదండ్రుల దగ్గర బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. దీంతో బంధువులు ఫోన్ పే లో అక్కడున్న వారికి డబ్బులు పంపిస్తే సాయంత్రానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
మారేడుపల్లి ఎస్ఐ కత్తితో దాడి చేసి పరారైన దుండగులు.. రాత్రి తనిఖీలు చేస్తుండగా..
ఇదిలా ఉండగా, నర్సీపట్నంలో ఓ వ్యక్తి తన భార్యను తీసుకెళ్లిన వారిని శిక్షించాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కొత్త వీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్ (35) సోమవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కాగా, మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.
అంతకుముందు దుర్గాప్రసాద్ తీసుకున్నసెల్ఫీ వీడియోలో ‘నర్సీపట్నంలోని ఓ వస్త్ర దుకాణం మేనేజర్ నా భార్యను తీసుకుపోయాడు. ఆమె అతని వద్దే ఉన్నా, తెలియదు అంటున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరి కారణంగా నేను చనిపోతున్నాను. దుకాణంలో పని చేస్తున్న యువకుడిని పట్టుకుంటే అంతా బయటకు వస్తుంది. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు ఇస్తే.. పట్టించుకోకుండా పక్కన పడేశారు. ఐదు నెలలుగా తిరుగుతున్నాను. వారిని శిక్షించి న్యాయం చేయండి సార్’ అని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోపై సిఐ శ్రీనివాసరావు స్పందిస్తూ దుర్గాప్రసాద్పై అతని భార్య ఫిర్యాదు చేయగా... గతంలో కౌన్సిలింగ్ చేశామని ఆ కోపంతో పోలీసులపై ఆరోపణలు చేసి ఉండవచ్చు అన్నారు.
దుర్గాప్రసాద్ కు పదేళ్ళ కిందట ఓ యువతితో పెళ్లి అయ్యింది. కాగా ఆమె అతడిని వదిలేసింది. తర్వాత తల్లిదండ్రులు లేని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె బట్టల దుకాణంలో పని చేసేది. నిరుడు ఏప్రిల్ లో పాడేరులో ఉంటున్న తన సోదరుడు ఇంటికి వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ తిరిగి రాలేదు. తాగుడు అలవాటు.. భార్య వెళ్ళిపోయిందన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదులో పేర్కొన్నారు అని తెలిపారు.