Asianet News TeluguAsianet News Telugu

ఆస్తికోసం భర్త, కొడుకు దారుణం.. మతిస్థిమితం లేని మహిళను రైలెక్కించి పంపించి, ఆమె డబ్బులతో జల్సాలు...

ఆస్తికోసం మతిస్థిమితం లేని మహిళ పట్ల భర్త, కొడుకు వ్యవహరించిన తీరు హృదయాల్ని మెలిపెడుతోంది. ఆమె చనిపోతేనే కోట్ల రూపాయల ఆస్తి తమకు దక్కుతుందని భావించిన వారు.. ఆమెను ఒంటరిగా రైలు ఎక్కించి, చేతులు దులుపుకున్నారు. 

husband and son abandon mentally unstable woman in warangal
Author
Hyderabad, First Published Aug 11, 2022, 8:30 AM IST

వరంగల్ : డబ్బు, ఆస్తిపాస్తుల కోసం మతిస్థిమితం తప్పిన మహిళను  భర్త, కుమారుడు కలిసి రైలు ఎక్కించి, ఎక్కడికో పంపించి వేశారు. ఆ తర్వాత  ఆమె  చనిపోయినట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. కోట్ల రూపాయల ఆస్తిని తమ పేర్ల మీదకి బదిలీ చేయించుకున్నారు.  ట్రైన్ లో చెన్నైకి చేరుకున్న ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది. వారు పంపిన ఫోటోలను పోలీసులు చూపెడితే కన్నకొడుకే గుర్తుపట్టడానికి నిరాకరించాడు. తన తల్లి కాదు పొమ్మని అన్నాడు. బంధాలు, అనుబంధాలకు మాయని మచ్చలా మారిన అత్యంత దారుణమైన ఈ సంఘటన హనుమకొండలో వెలుగుచూసింది.

ఈనాడు కథనం ప్రకారం... హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన మహిళ(46)కు భర్త, కొడుకు ఉన్నారు. కొడుకు బెంగళూరులో   ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా ఆమెకు పెళ్లి సమయంలో తల్లి తండ్రులు కట్నకానుకల కింద  కొన్ని ఆస్తులు ఇచ్చారు. వాటి విలువ  ప్రస్తుత  మార్కెట్ ప్రకారం సుమారు రూ. 15 కోట్లు ఉంటుంది. అయితే, భర్త మరో మహిళను వివాహం చేసుకుని ఈమెను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆస్తిని తన పేరిట  మార్చాలని  ఆమెను వేధింపులకు గురి చేశాడు.  ఈ క్రమంలోనే తనకూ ఆస్తిలో భాగం వస్తుందని కొడుకు తండ్రితో చేరిపోయాడు. దీనికి ఆమె అంగీకరించలేదు.

నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు : బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్

రైలెక్కించి...
ఆస్తి కోసం భర్త, కొడుకుపెట్టే వేధింపులతో  కొన్నిరోజుల్లోనే ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఆమె చనిపోతే ఆస్తిని తమ పేరు మీదికి  మార్పించుకోవచ్చని వారు పన్నానం పన్నారు. 2017లో ఓరోజు ఇద్దరూ దగ్గరుండి ఆమెను రైలెక్కించి ఎక్కడికో పంపించి వేశారు. ఆ తర్వాత ఆమె ఎక్కడో తప్పిపోయిందని బంధువులను నమ్మించారు. భర్త మరో మహిళతో విదేశాలకు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి బంధువులు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. తప్పిపోయిన మహిళ తల్లి వృద్ధురాలు కావడం,  ఆమె స్థానికంగా కాకుండా ఎక్కడో ఉంటుండడంతో.. ఆమె కూడా కుమార్తె గురించి ఎప్పుడూ ఆచూకీ తీయలేదని స్థానికులు పేర్కొన్నారు.

చెన్నైలో...
కొద్దిరోజుల తర్వాత  ఎక్కడెక్కడో తిరిగి ఆమె చెన్నైకి చేరుకుంది. చెన్నై పోలీసుల సహాయంతో అన్బగం రిహాబిలిటేషన్ సెంటర్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసింది.  మానసికంగా కుంగిపోయిన ఆమె పాత జ్ఞాపకాలు మరిచిపోయింది. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెకు ఆశ్రయం కల్పించి, వైద్యం చేయించారు. దీంతో ఆమెలో కొంత మార్పు వచ్చింది. అయినా ఆమె గతాన్ని గుర్తు తెచ్చుకో లేకపోయింది.

ఆధార్ తో..
స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమెకు ఆధార్ కార్డు తీయాలని చెన్నైలోని ఓ ఆధార్ కేంద్రానికి తీసుకువెళ్లింది. అక్కడ వేలిముద్రలు తీస్తుండగా.. అప్పటికే ఆమెకు కార్డు ఉన్నట్లు సాఫ్ట్వేర్ గుర్తించింది.  వెంటనే కార్డు తీసుకొని వివరాలు సేకరించగా హనుమకొండ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. చిరునామాలో సంప్రదించేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు అందుబాటులోకి రాకపోవడంతో హనుమకొండ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పంపిన ఫోటో తో మహిళ కుమారుడు వద్దకు వెళ్లారు. ఆమె ఫొటో చూపించి మీ తల్లి అవునా, కాదా.. అని  ప్రశ్నించారు. ఖంగుతిన్న కొడుకు.. ముందు కాదు అని చెప్పాడు. తర్వాత తన తల్లి ఎప్పుడో చనిపోయిందంటూ.. మరణ ధ్రువీకరణ పత్రం తన వద్ద ఉందని బుకాయించాడు. దీంతో లోతుగా విచారిస్తే వారి కుట్ర బయట పడింది.

కోట్ల రూపాయల ఆస్తులు కోసం..
మహిళ తప్పిపోయి అయిదేళ్లు అవడంతో భర్త, కొడుకు కలిసి ఆమె చనిపోయినట్లుగా చెప్పి వరంగల్ నగర పాలక సంస్థ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. వెంటనే ఆమె పేరిట ఉన్న సుమారు 15 కోట్ల రూపాయలు ఆస్తులను తమ పేరు మీదకి బదిలీలు చేయించుకున్నారు. ఆస్తుల కోసం తల్లి చనిపోయినట్లు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చింది.  డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అయ్యిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళ  స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల వద్ద ఉంటోంది. కుటుంబ సభ్యులు అనుమతిస్తే ఆమెను తీసుకు వచ్చే వీలుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సీఎం, గవర్నర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు ఉత్తరాలు పంపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios