Siddipet: నకిలీ విత్తనాలు, రసాయనాలు, పురుగుల మందులు మార్కెట్ లో వెలుగుచూడటం కలకలం రేపుతోంది. భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు, పురుగుల మందులను టాస్క్ ఫోర్స్ అధికారులు సిద్దిపేటలో పట్టుకున్నారు. రైతులు 87126 67100 నంబర్కు కాల్ చేసి నకిలీ లేదా గడువు ముగిసిన విత్తనాలను విక్రయ వివరాలు తెలిస్తే చెప్పాలని సూచించారు.
spurious seeds, pesticides seized in Siddipet: రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల విస్తరించాయి. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాలు నాటుతున్నారు. ఇదే సమయంలో నకిలీ విత్తనాలు, రసాయనాలు, పురుగుల మందులు మార్కెట్ లో వెలుగుచూడటం కలకలం రేపుతోంది. తాజాగా భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు, పురుగుల మందులను టాస్క్ ఫోర్స్ అధికారులు సిద్దిపేటలో పట్టుకున్నారు. వీటిని విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. రైతులు 87126 67100 నంబర్కు కాల్ చేసి నకిలీ లేదా గడువు ముగిసిన విత్తనాలను విక్రయ వివరాలు తెలిస్తే చెప్పాలని సూచించారు.
వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని విత్తన దుకాణాలపై దాడి చేసి పెద్ద సంఖ్యలో నకిలీ, ప్యాక్ చేయని విత్తనాలతో పాటు గడువు ముగిసిన పురుగుమందులు, పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ బృందం తెలంగాణ ట్రేడర్స్, శ్రీలక్ష్మీ సేవా కేంద్రం, జ్యోతి ట్రేడర్స్, బాలాజీ రైతు సేవా కేంద్రాల్లో నిల్వలను తనిఖీ చేసి 75 కిలోల లూజ్ విత్తనాలు, 60 లీటర్ల గడువు తీరిన పురుగుమందులు, 55 కిలోల గడువు తీరిన పౌడర్, వివిధ పంటలకు గడువు తీరిన విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది.
రైతులు విత్తన, పురుగు మందుల కొనుగోళ్లకు అమ్మకందారుల నుంచి రశీదులు తీసుకోవాలని పోలీసు ప్రకటనలో కోరారు. అలాగే, నకిలీ విత్తనాల గురించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. విత్తనాలు తీసుకునే ముందు అన్ని వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. అలాగే, నకిలీ లేదా గడువు తీరిన విత్తనాల అమ్మకాలపై రైతులు 87126 67100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
గత నెలలోనూ సంగారెడ్డిలోని సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో గత నెలలో (మే 19న) ఓ డీలర్ వద్ద నకిలీ విత్తనాలు, పురుగు మందులు పట్టుబడ్డాయి. కొందరు రైతుల ఫిర్యాదు మేరకు బి.నరసింహారావు నేతృత్వంలో వ్యవసాయ శాఖ అధికారులు ఉదయ్ కుమార్ జైన్ కు చెందిన హలమా సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాపు, గోడౌన్ పై దాడి చేశారు. ల్యాబ్ కు పంపిన విత్తనాలు, పురుగు మందులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైన్ గత ఏడాది నీరుడి నగేష్ అనే రైతుకు నకిలీ పురుగుల మందును విక్రయించినట్లు నరసింహారావు తెలిపారు. నగేష్ తన పత్తి పొలంలో ఈ పురుగుమందులను పిచికారీ చేయడంతో పత్తి పంట మొత్తం ఎండిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. దీనిపై ఫిర్యాదులు చేసినా గత ఏడాది జైన్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నగేష్ కు పంట నష్టానికి పరిహారం చెల్లిస్తామని జైన్ హామీ ఇచ్చినా ఆయన దానిని నిలబెట్టుకోలేదు.
