Asianet News TeluguAsianet News Telugu

నేటితో చివరి రోజు.. ఖైరతాబాద్ గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడం భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో ఖైరతాబాద్ మహాగణపతిని సుమారు 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు

Huge Devotees Rush at Khairatabad Ganesh On Last Day
Author
Hyderabad, First Published Sep 18, 2021, 5:52 PM IST

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడం భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో ఖైరతాబాద్ మహాగణపతిని సుమారు 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ రద్దీ నెలకొంది. మరోవైపు రేపటి ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్రకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కాగా, నిమజ్జనం మొత్తం ఆదివారమే పూర్తయ్యేలా ప్రణాళిక అమలు చేయనున్నారు అధికారులు. హుస్సేన్  సాగర్ చుట్టూరా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, అలాగే నెక్లెస్ రోడ్, బుద్ధ భవన్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 28 భారీ క్రేన్లను అందుబాటులో వుంచారు. అలాగే అడుగుకు మించి వున్న విగ్రహాలను అప్పర్ ట్యాంక్ బండ్ వద్దకు అనుమతించనున్నారు. పది అడుగుల కంటే తక్కువ వున్న విగ్రహాలన్నింటిని ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్ వైపు మళ్లించనున్నారు. 

Also Read:గణేశ్ నిమజ్జనం... 27,000 మంది పోలీసులతో భారీ భద్రత: సీపీ అంజనీ కుమార్

320 కిలోమీటర్ల పరిధిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలును నడుపుతున్నారు అధికారులు. తెలంగాణలో ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు ప్రత్యేక స్థానముంది. భారీ విగ్రహ ఏర్పాటు, శోభాయాత్ర, నిమజ్జనం అంతా సర్వత్రా ఆసక్తి కలిగిస్తాయి. ఈ ఏడాది 40 ఫీట్ల విగ్రహాలను రూపొందించగా.. నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా వుంటాయన్నది ఉత్కంఠగా మారింది. కోవిడ్ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం శోభాయాత్రకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

Follow Us:
Download App:
  • android
  • ios