మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవెల్లిలో అధికారులు ఇళ్లను కూల్చివేస్తుండగా శిథిలాల కింద చిక్కుకుని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. 

సిద్దిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతగ్రామమైన ఎర్రవల్లిలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో ఒకటయిన ఎర్రవల్లిలో శనివారం అర్ధరాత్రి నుండి అధికారులు ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చేపట్టిన ఈ కూల్చివేతలు ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇళ్ల కూల్చివేతను ప్రారంభించారు. దీంతో ఓవైపు ఇళ్ళను కూలుస్తుండగానే బాధితులు సామాన్లను బయటకు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సగం కూల్చిన తన ఇంట్లోంచి సామాన్లు తెచ్చుకోడానికి వెళ్లిన కనకయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి పైకప్పు కోసం ఉపయోగించిన భారీ మొద్దులు(దూలాలు) ఒక్కసారిగా కుప్పకూలి మీదపడటంతో కనకయ్య తీవ్రంగా గాయపడ్డాడు. 

read more సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమన్నారు: కేసీఆర్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

వెంటనే కుటుంబసభ్యులు దూలాల కింద చిక్కుకున్న కనకయ్యను బయటకు తీసి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కనకయ్య ప్రాణాలు పోయాయని కుటుంబసభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. 

గ్రామస్తులు కూడా కనకయ్య మృతికి అధికారులే కారణమని ఆరోపిస్తున్నారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఒక్కసారి జేసిబిలతో వచ్చి ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారని అన్నారు. పోలీసు బలగాల మధ్య గ్రామస్తులను కూడా ఊర్లోకి రానివ్వకుండా పనులు జరుపుతున్నారని అన్నారు. ఇంట్లోని వస్తువులు తీసుకోడానికి ఒకటి రెండు రోజులు సమయం అడిగినా అధికారులు ఇవ్వడంలేదని గ్రామస్తులు వాపోయారు.