రెండు ప్రాణాల కంటే తమ ఎంజాయ్ మెంటే ముఖ్యమని హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన హైదరాబాద్ లో వెెలుగుచూసింది. ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్వాకానికి అప్పుడే పుట్టిన శిశువు బలయ్యింది. 

హైదరాబాద్ : ప్రాణాలను కాపాడే వైద్యులను ప్రజలు దేవుళ్లగా భావిస్తుంటారు. అలాంటి వైద్య సిబ్బంది పార్టీలో మునిగితేలుతూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిండు గర్భిణి నరయాతన అనుభవించింది. తల్లీ బిడ్డ ప్రాణాలకంటే తమ ఎంజాయ్ మెంటే ముఖ్యమని హాస్పిటల్ సిబ్బంది భావించడంతో కళ్లు తెరవకుండానే శిశువు మృతిచెందింది. వైద్య వ‌ృత్తికే కలంకం తీసుకువచ్చే ఈ అమానుష ఘటన మెడికల్ హబ్ గా పేరెన్నికగన్న హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాలకలోకి వెళితే... హైదరాబాద్ చాదర్ ఘాట్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ కూతురు పెళ్లి వచ్చేనెలలో వుంది. దీంతో అతడు ముందుగానే హాస్పిటల్ సిబ్బందికి పార్టీ ఏర్పాటు చేసాడు. హాస్పిటల్ భవనంలోనే టెర్రస్ పై హాస్పిటల్ సిబ్బంది పెద్ద సౌండ్ తో డిజె పెట్టుకుని డ్యాన్సులు చేసారు. ఇలా విందు చిందులతో ఎంజాయ్ చేసారు. 

ఇలా హాస్పిటల్ సిబ్బంది పార్టీలో మునిగిపోయి వుండగా నిండు గర్భిణి పురిటినొప్పులతో హాస్పిటల్లో చేరింది. గర్భిణి నరకయాతన అనుభవిస్తున్నా హాస్పిటల్ సిబ్బంది ఏమాత్రం కనికరం ప్రదర్శించలేరు. అంతకంతకూ మహిళ పరిస్థితి మరింత విషమంగా మారుతున్నా పార్టీలోంచి వచ్చి వైద్యం చేయడానికి ఇష్టపడలేదు. ఇలా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కళ్ళు తెరిచి లోకం చూడకుండానే శిశువు మృతి చెందింది. తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. 

వైద్యుల నిర్లక్ష్యమే పసిగుడ్డు ప్రాణాలు తీయడమే కాదు తల్లిని కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టడంపై బాధిక కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వద్దకు భాదిత కుటుంబం, బంధువులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చాదర్ ఘాట్ పోలీసులు రంగంలోకి దిగారు. 

ఆందోళనకు దిగిన బాధితులతో మాట్లాడి తగిన న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. దీంతో మృతిచెందిన శిశువు పోస్ట్ మార్టం కు అంగీకరించడమే కాదు ఆందోళనను విరమించారు. బాధిత కుటుంబ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.