పహల్గాంలో ఉగ్రవాదులు మత ప్రాతిపదికన టూరిస్ట్ లను కాల్చిచంపడంతో బాధిత హిందు సమాజంలో ఆగ్రహజ్వాలలు రేగాయి. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందు జనాభా తగ్గుదలపై సంచలనం వ్యాఖ్యలు చేసారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే...
తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువుల జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసారు. భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రతి హిందువు వీలైనంత ఎక్కువమంది పిల్లలను కనాలని సూచించారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దని సూచించారు. మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్ చేసారు.
హిందువులంతా ఐక్యంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందని బిజెపి ఎమ్మెల్యే అన్నారు. ధర్మం లేకుంటే దేశం లేదు... ఈ రెండు లేకుంటే మన భవిష్యత్ ఉండదన్నారు. హిందువులంతా ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలు దుమారం రేపేలా ఉన్నాయి. మతం పేరిట బిజెపి రాజకీయాలు చేస్తుందంటూ ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. ఇప్పుడు రాకేష్ రెడ్డి మాటలను పట్టుకుని బిజెపిపై మరింత విమర్శలు చేయవచ్చు. అయితే హిందూ సంఘాలు, హిందుత్వవాదులు మాత్రం ఎమ్మెల్యే మటలను సమర్ధించవచ్చు.
కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ గా చేసుకుని అతి కిరాతకంగా కాల్చిచంపారు. ఈ క్రమంలోనే హిందువులు ఐక్యంగా ఉండాలని బిజెపి నాయకులు పదేపదే చెబుతున్నారు. కులాలు, రాజకీయాల పేరిట హిందువులు తన్నుకుంటుంటే ఇతర మతాలవారు రెచ్చిపోతారని... అదే హిందువులంతా కలిసుంటే ఎవరూ ఏం చేయలేరని అంటున్నారు. బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఆదే అభిప్రాయం వ్యక్తం చేసారు.