హిజ్రాపై రౌడీషీటర్, పహిల్వాన్ల ప్రతాపం.. పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాల నిరసన
హైదరాబాద్లో ఓ హిజ్రాపై రౌడీషీటర్ దాడి చేయడంతో న్యాయం చేయాలంటూ హిజ్రాలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనకాల ఇందిరానగర్లో యాస్మిన్ అనే హిజ్రా ఈ నెల 27వ తేదీన సహచర హిజ్రాలతో కలిసి నిద్రిస్తోంది
హైదరాబాద్లో ఓ హిజ్రాపై రౌడీషీటర్ దాడి చేయడంతో న్యాయం చేయాలంటూ హిజ్రాలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనకాల ఇందిరానగర్లో యాస్మిన్ అనే హిజ్రా ఈ నెల 27వ తేదీన సహచర హిజ్రాలతో కలిసి నిద్రిస్తోంది.
ఈ సమయంలో రౌడీషీటర్ వెంకట్ యాదవ్, సనత్నగర్ పహిల్వాన్ సాయి ఇద్దరూ ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ప్రతి నెలా తమకు ఇచ్చే రూ.10 వేల మామూళ్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తూ.. ఆమెను తీవ్రంగా కొట్టారు.
అక్కడితో ఆగకుండా నిద్రిస్తున్న హిజ్రా 17 నెలల కూతురిని కూడా హత్య చేస్తామంటూ బెదిరించారు. బలవంతంగా తాళం చెవులు లాక్కొని బీరువాలో ఉనన రూ.2 లక్షల నగదు, బంగారం, ఆమె సెల్ఫోన్ లాక్కున్నారు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. అంతు చూస్తామంటూ బెదిరించారు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని సహచర హిజ్రాలకు తెలియజేసింది.. అలా క్షణాల్లో విషయం నగరంలోని హిజ్రా గ్రూపులకు తెలియడంతో వారంతా శనివారం రాత్రి 10 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.
ఈ నెల 27న తాము ఫిర్యాదు చేస్తే.. ఇప్పటి దాకా చర్యలు తీసుకోలేదని పోలీసులు ప్రశ్నించారు.. రాత్రి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు వందల సంఖ్యలో హిజ్రాలు స్టేషన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పడంతో.. హిజ్రాలు ఆందోళన విరమించారు.