మావోయిస్టు మృతదేహానికి రీపోస్ట్మార్టం: గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన లింగన్న మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన లింగన్న మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
లింగన్న ఎన్కౌంటర్పై విచారణ చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రీపోస్ట్మార్టం జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
నివేదికను సీల్డు కవర్లో సమర్పించాలని మెడికల్ బోర్డు సీనియర్ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఎన్కౌంటర్పై పూర్తి వివరాలతో ఈ నెల 5న కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యాయస్థానం ఆదేశాలతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు లింగన్న మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో హాస్పిటల్ ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం లింగన్నను ఎన్కౌంటర్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.