మెదక్‌ జిల్లాకు చెందిన ఖదీర్‌ ఖాన్‌ మృతి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా  విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి నేడు హైకోర్టు‌లో విచారణ జరిగింది.

మెదక్‌ జిల్లాకు చెందిన ఖదీర్‌ ఖాన్‌ మృతి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి నేడు హైకోర్టు‌లో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, మెదక్ డీఎస్పీ, ఎస్‌హెచ్‌వోను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. 

చైన్ స్నాచింగ్ కేసులో ఖ‌దీర్‌ ఖాన్‌ ప్రమేయం ఉందని గత నెల 29న ఆయనను మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ యాకుత్ పురాలో బంధువు ఇంటికి వెళ్లిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కస్టడీ నుంచి విడుదలైన తర్వాత ఖదీర్ ఆస్పత్రిలో చేరారు. అయితే పోలీసులు కస్టడీలో తనను దారుణంగా హింసించారని ఖ‌దీర్‌ ఖాన్‌ను ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో శ‌నివారం నాడు ఇందులో భాగ‌మైన‌ కొంతమంది పోలీసులపై దర్యాప్తు-క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్న‌తాధికారులు హామీ ఇచ్చారు. 

Also Read: పోలీసుల కస్టడీలో చిత్రహింస‌లు.. మృతుడు మహ్మద్ ఖదీర్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాకు కాంగ్రెస్ డిమాండ్

అయితే ఖదీర్ మృతికి ముందు చోటుచేసుకున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉండటంతో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు దెబ్బలకు తట్టుకోలేకనే మెదక్‌కు చెందిన ఖదీర్ ఖాన్ మృతి చెందినట్లుగా ఆరోపణల నేపథ్యంలో.. మీడియాలో వచ్చిన వార్త కథనాలను సమోటోగా తీసుకున్న హైకోర్టు విచారణకు స్వీకరించింది.