కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన ఏజీ..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ వివరణ కోసం అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేసును మధ్యాహ్నానికి పాస్ ఓవర్ చేసింది. ధర్మాసనం ఎదుట హాజరైన అడ్వొకేట్ జనరల్.. ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు పిటిషన్పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
మరోవైపు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని కౌన్సిలర్లకు రైతు జేఏసీ సభ్యులు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఇక, మున్సిపల్ అధికారులు ముసాయిదా మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణకు జనవరి 11 గడువు విధించారు.
ఇదిలా ఉంటే.. ముసాయిదా మాస్టర్ ప్లాన్ ప్రకారం కామారెడ్డిలో పారిశ్రామిక జోన్ ఏర్పాటుకు తమ భూములను సేకరించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గతవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తమ అభ్యంతరాలను అధికారులు పట్టించుకోవడం లేదని పులవురు రైతులు శనివారం హైకోర్టును ఆశ్రయించారు.