భారీ వర్షాలు: హైద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ ను మళ్లించారు. చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ ను మళ్లించారు. చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
హైద్రాబాద్ నగరంలో 32 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో పలు చోట్ల రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి.
ఆరంఘర్ చౌరస్తా కు సమీపంలో హైద్రాబాద్ -కర్నూల్ జాతీయ రహదారి పూర్తిగా నీటితో నిండిపోయింది. నీరు తగ్గే వరకు ఈ మార్గంలో వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
విమానాశ్రయం, జాతీయ రహదారి 44లోని కర్నూల్ నుండి షాద్ నగర్ వైపు వెళ్లే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. పీవీఆర్ ఎక్స్ప్రెస్ మార్గంపై వాహనాలపై రాకపోకలను నిలిపివేశారు.
మెహిదీపట్నం నుండి గచ్చిబౌలి వైపు వెళ్లాలనుకొనే వాహనదారులు టోలిచౌకి ఫ్లైఓవర్ ను కాకుండా సెవెన్ టూంబ్స్ రహదారిపై వెళ్లాలని పోలీసులు సూచించారు.
మూసీనుండి వరద నీరు పోటెత్తడంతో పురానాపూల్ వద్ద 100 అడుగుల రహదారి పూర్తిగా మూసివేశారు. ఈ దారిని కాకుండా ప్రత్యామ్నాయంగా వాహనదారులు కార్వాన్ వైపుకు మళ్లించారు.
అంబర్ పేట వద్ద అలీకేఫ్, అంబర్ పేట రహదారి మధ్య మూసారం బాగ్ , ఆర్టీఏ ఆఫీస్ వంతెనను పూర్తిగా మూసివేశారు. ఈ మార్గాల్లో వెళ్లాల్సిన ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
ఫలక్నుమా రైల్వే బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. ఈ రహదారిన వెళ్లాల్సిన ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని పోలీసులు కోరారు.