సిరిసిల్లలో కుండపోత... చెరువులా మారిన రోడ్లు, ఇళ్లమధ్యలో వరదనీటి ఉదృతి (వీడియో)
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం రాత్రి నుండి సిరిసిల్ల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లన్ని చెరువుల్లా మారాయి.
సిరిసిల్ల: తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులగా అయితే కుండపోత వర్షం కురుస్తుండటంతో వివిధ పట్టణాలు, గ్రామాల్లో రోడ్లు, కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువుల్లా మారిపోయాయి. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలోని వాగులు వంకలు వరద నీటితో ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి.
సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువు నుండి పాత బస్టాండ్ వరకు రోడ్లన్ని జలమయమైన చిన్నపాటి వాగు కాలనీల మధ్యలో ప్రవహిస్తుందా అన్నట్లు కనిపిస్తోంది. ఈ వరదనీటిలో పట్టణంలోని పలు షాపులు మునిగిపోగా లోతట్టుప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుకులకు గురవుతున్నారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్తబస్టాండ్ ఆవరణలోకి భారీగా వరద నీరు చేరి రోడ్లు , షాపులు మునిగిపోయాయి.
read more తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అతిభారీ వర్షాలు... ఐదు జిల్లాల్లో రెడ్ అలెర్ట్
భారీ వర్షం కారణంగా సిరిసిల్ల-కరీంనగర్ రహదారిపైకి వరదనీరు చేరి నదిని తలపిస్తోంది. వర్షపు నీటిలో వాహనాలు మునిగిపోయాయి. ఇక జిల్లాలోని పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరి పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామలలో పంటపొలాలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వీడియో
గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షంతో కరీంనగర్ నుండి వేములవాడకి వెళ్లేదారిలో అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద వాగు ఉద్రుతంగా ప్రవహిస్తూ రోడ్డుపైకి చేరింది. దీంతో ఈ దారిలో రాకపోకలు బంద్ అయ్యాయి. వేములవాడ - మల్లారంకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వేములవాడ - కోరుట్ల వెళ్లే దారిలో నాగయ్యపల్లి వద్ద వరద నీటితో రాకపోకలు బంద్ అయ్యాయి. హన్మాజిపేట వద్ద నక్క వాగు ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్డుపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా చాలా గ్రామాల మధ్య వంతెనలపైకి నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.