హార్ట్ ఎటాక్ గురయిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తుండగా మధ్యలో రైల్వే గేట్ పడటంతో అంబులెన్స్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

కరీంనగర్ : గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలో వున్న వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. దీంతో అంబులెన్స్ లోనే గుండెలో నొప్పి భరించలేక అతడు విలవిలవిల్లాడిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది సిపిఆర్ చేస్తూ అతడిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసారు. కానీ రైలు వెళ్లిపోయి గేటు ఎత్తే సమయానికి అతడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. 

బాధిత కుటుంబం, పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన విజయ్, సుధీవన భార్యాభర్తలు. వీరి కూతురు స్పందన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నిన్న రెండో శనివారం సెలవురోజు కావడంతో కూతురిని చూసేందుకు విజయ్ దంపతులు మల్లాపూర్ కు వెళ్లారు. 

కూతురితో మాట్లాడుతుండగా విజయ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో స్కూల్ సిబ్బంది సాయంతో అతడిని భార్య సుధీవన అంబులెన్స్ లో తరలించింది. అయితే రైలు వస్తుండటంతో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వేయగా అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది. ఇలా దాదాపు 15నిమిషాలపాటు అంబులెన్స్ అక్కడి ఆగిపోవడంతో విజయ్ పరిస్థితి విషమించి మృతిచెందాడు.

కొద్దిసేపట్లో హాస్పిటల్ కు వెళతారనగా రైలు గేటు పడటంతో విజయ్ కు సమయానికి వైద్యం అందలేదు. గేటు పడకుండా వుంటే విజయ్ బ్రతికేవాడని అక్కడున్నవారు అంటున్నారు. హాస్పిటల్ కు చేరుకునేసరికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో భార్య సుధీవన, కూతురు స్పందన కన్నీరుమున్నీరుగా విలపించారు.

కూతురును చూసేందుకని వెళ్లినవాడు ఇలా మృతదేహంగా గ్రామానికి తిరిగిరావడంతో స్తంభంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తనకోసం వచ్చే చనిపోయావు నాన్న... రాకుండా వుంటే బ్రతికేవాడివేమో అంటూ విజయ్ మృతదేహాన్ని పట్టుకుని కూతురు స్పందన రోదిస్తున్న తీరు అందరితో కన్నీరు పెట్టిస్తోంది.