సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది.
హుస్నాబాద్ : గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్న లిస్టులో మరో మృతి చేరింది. తెలంగాణలోని హుస్నాబాద్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ ఘటన వెలుగు చూసింది. హుస్నాబాద్ నగరంలో కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది.
ఈ టోర్నమెంట్ లో 37యేళ్ల శనిగరం ఆంజనేయులు అనే వ్యక్తి పాల్గొన్నాడు. బౌలింగ్ చేస్తుండగా.. ఆంజనేయులుకు ఒక్కసారి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన మిగతావారు వెంటనే అతడికి సీపీఆర్ చేశారు. అయినా.. ఫలితం లేకపోయింది. అతను మృతి చెందాడు. ఆంజనేయులు స్వస్థలం చిగురుమామిడి మండలం సుందరగిరి. ఈ ఘటనతో హుస్నాబాద్ లో విషాదం నెలకొంది.
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. గొడవపడి తండ్రిని చంపిన తనయుడు
ఇదిలా ఉండగా, ఓ 13యేళ్ల బాలిక గుండెపోటు మరణించిన ఘటన ఈ నెల ఒకటిన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గుండెపోటు ఓ 13 ఏళ్ల చిన్నారిని బలి తీసుకుంది. మెహబూబాబా బాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాయిపాలెం శివారు బోడ తండాకు చెందిన దంపతులు బోడ లక్పతి, వసంత. వారి కూతురు స్రవంతి. 13యేళ్ల చిన్నారి. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు ఇచ్చారు.
సెలవు రోజు కావడంతో తండాలోని తన స్నేహితులతో రోజంతా ఆడుకుంది. రాత్రి అయ్యాక మామూలుగానే నిద్రపోయింది. ఆమెకు రోజూ నానమ్మ దగ్గర పడుకునే అలవాటు. ఆ రోజు కూడా అలాగే పడుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున సడన్ గా మేల్కొన్న ఆమె.. తనకు ఏదో అవుతుందని ఆయాస పడుతూ నాన్నమ్మను లేపింది. కంగారుపడి నిద్రలేచిన ఆమె ఏం జరిగిందని అడుగుతుంటే.. ఆయాస పడుతూ మాట్లాడలేకపోయింది.. మంచం మీద లేచి కూర్చుని ఒక్కసారిగా మంచం పైనే పక్కకు ఒరిగిపోయింది.
వెంటనే ఆమె తన కొడుకు, కోడలికి విషయం తెలిపింది. కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే కూతుర్ని తీసుకుని దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పరుగులు తీశారు. అయితే, అక్కడికి వెళ్లేసరికి ఆమె చనిపోయిందని డాక్టర్ తెలపడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
