గుమ్మడి కాయ దొంగెవరంటే... ఈటల భుజాలు తడుముకుంటున్నాడు: మంత్రి హరీష్ చురకలు
హుజురాబాద్ నియోజకవర్గ విశ్రాంత ఉద్యోగుల సమ్మేళనంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలింపించాలని కోరారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో ఓడిపోతానన్న భయం మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పట్టుకుందని... అందువల్లే తనపై అవాకులు చవాకులు పేలుతున్నాడని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇంట్లోకి కూడా లబ్దిదారులు గృహ ప్రవేశం చేయలేదని... ఇది ఈటల పనితనం అన్నారు. ఇక్కడి ప్రజలను ఈటల ప్రలోభాలకు గురి చేసింది వాస్తవం కాదా? అని అడిగారు. వీటన్నింటి గురించి మాట్లాడితే గుమ్మడి కాయలు దొంగ మాదిరిగా భుజాలు తడుముకుంటున్నారని హరీష్ ఎద్దేవా చేశారు.
హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హుజూరాబాద్ ను అభివృద్ది చేయాలంటూ ఈటల రాజీనామ చేసిండా? అని ప్రశ్నించారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడని అన్నారు. ఓ వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యమో, వ్యవస్థ ప్రయోజనాలు ముఖ్యమో మీరే ఆలోచించుకోవాలని హరీష్ సూచించారు.
''మాట కోసం నిలబడే వ్యక్తిని అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. మాట మీద నిలబడతాను కాబట్టే నా నియోజకవర్గంలో ప్రత్యర్థులకు ఐదుసార్లు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు హుజూరాబాద్ కు ఏ మాట ఇచ్చినా అది పూర్తిచేసే బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను'' అని స్పష్టం చేశారు.
read more Huzurabad Bypoll: టీఆర్ఎస్ గూటికి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్
''20 ఏళ్ళ నుండి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో వున్నా అతడి ఆస్తి కేవలం రెండు గుంటలు మాత్రమే. తెలంగాణ ప్రజల ఆశీస్సులే గెల్లు శ్రీనివాస్ అస్థి. ఇలాంటి నిస్వార్థపరుడిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను నేను తీరుస్తా'' అని హరీష్ భరోసా ఇచ్చారు.
''నేను కూడా ఒక రిటైర్డ్ ఉద్యోగి బిడ్డనే. తెలంగాణ ఉద్యమంలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర గొప్పది. 1969 ఉద్యమంలో కూడా విశ్రాంత ఉద్యోగులు చాలా మంది పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సీఎం కేసీఅర్ కు కుడి భుజంగా నిలిచారు. తెలంగాణ వచ్చుడో... కేసీఅర్ సచ్చుడో అనే నినాదం తో కేసీఅర్ ముందుకు వెళ్ళారు. 15 సంత్సరాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది'' అని పేర్కొన్నారు.
''కాళేశ్వరం విషయం లో ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేసాయి. కానీ కాళేశ్వరం మొదటి ఫలితం హుజురాబాద్ కే దక్కింది. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం గా నిలిచింది. మూడేళ్లలో మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ'' అని మంత్రి హరీష్ కొనియాడారు.