కరోనా వ్యాక్సిన్ సరఫరా పెంచాలంటూ కేంద్రమంత్రికి లేఖ రాసిన హరీష్ రావు
Telangana: తెలంగాణకు తక్షణమే 50 లక్షల కరోనావైరస్ వ్యాక్సిన్ డోసులను అందించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
cpovid-19 vaccine supply: ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన సర్కారు వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవడం పై దృష్టి సారించింది. అలాగే, కరోనా టీకాలను ముమ్మరంగా అందిస్తోంది. రెండు డోసులు అందించడంతో పాటు బూస్టర్ డోసులను కూడా ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ సరఫరాను పెంచాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
వివరాల్లోకెళ్తే.. కరోనా వ్యాక్సిన్ సరఫరాను పెంచాలని కోరుతూ తెలంగాణ (Telangana) ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మసుఖ్ మాండవ్యకు లేఖ రాశారు. తక్షణమే 50 లక్షల డోసులు అందించాలని కోరారు. తెలంగాణ మొదటి డోస్ 106 శాతం, రెండో డోస్ 104 శాతం పూర్తి చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముందుజాగ్రత్త మోతాదులను (బూస్టర్ డోసులు) ఇస్తున్నామని, రోజుకు 1.5 లక్షల మంది ఇస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణలో రోజుకు 3 లక్షల డోస్లు వేసే అవకాశం ఉందని, వ్యాక్సిన్ల కొరత వల్ల అది అమలు కావడం లేదని మంత్రి (Harish Rao) అన్నారు. వ్యాక్సిన్ సరఫరా పెంచాలని రాష్ట్రం పదేపదే అభ్యర్థించిందని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 2.7 లక్షల వ్యాక్సిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నందున టీకా ప్రక్రియ మందగిస్తోందని తెలిపారు.
తెలంగాణకు 50 లక్షల డోసులను అందించాలని మాండవ్యను హరీష్ రావు కోరారు. ఇది ముందు జాగ్రత్త మోతాదుల (బూస్టర్ డోసుల) కోసం టీకా ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇదిలావుండగా, దేశంలో కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయి. 42 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదై మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,41,74,650 చేరుకుంది. కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 5,26,772కు పెరిగింది. ఇక తెలంగానలో గత 24 గంటల్లో 528 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,26,284కి చేరుకుంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 196 కేసులు నమోదయ్యాయి. 771 మంది ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,16,506గా ఉందని ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. రికవరీ రేటు 98.82 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటివరకు 4,111 మంది చనిపోయారు. సోమవారం 33,455 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్లో పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 5,667గా ఉంది.