కాంగ్రెస్ పార్టీకి కొత్త పేరు పెట్టిన హరీష్
- రైతులను అడగాలి తెలంగాణలో పాలన ఎలా ఉందో
- కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డంపడే తీరు సరికాదు
తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డం పడుతూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సరికొత్త పేరును హరీష్ రావు నామకరణం చేశారు. ఆ పేరేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో హరీష్ రావు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఏ తిట్టూ వదలకుండా తిట్టేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కోతల పార్టీ అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కరెంటు కోతలు ఉండేవన్నారు. అందుకే ఆ పార్టీకి కరెంటు కోతల పార్టీ అని నామకరణం చేశారు హరీష్.
తెలంగాణలో కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేకుండా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి గ్రామాల్లో రైతులను అడగాలంటూ సవాల్ చేశారు. గతంలో కేవలం ఆరు గంటలే కరెంటు ఇచ్చేవారని, అది కూడా ఎపుడిస్తరో తెలియక రైతులు ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు.
మోటార్లు కాలే కరెంటు, సాటర్లు కాలే కరెంటు, పంటలు ఎండే కరెంటు ఇచ్చి రైతులను నిండా ముంచారని ఆరోపించారు. తమ పాలనలో కరంటు సరఫరా మెరుగైందని వివరించారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు కరెంటు కోతలు అనే మాటే లేకుండా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోతే తమ హయాంలో ఆ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారిపోయాయని హరీష్ పేర్కొన్నారు.
కరెంటు కోతల పార్టీగా చెప్పడంతో మరి కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి