GruhaLaxmi: గృహలక్ష్మీ పథకం కింద ఇల్లు మంజూరైన వారి పరిస్థితి ఏమిటీ? రేవంత్ సర్కారు ఆదేశాలివే
గృహలక్ష్మీ పథకం కింద మంజూరైన ఇళ్ల పరిస్థితి ఏమిటీ? ప్రొసీడింగ్స్ వచ్చిన ఇళ్లకు గృహలక్ష్మీ కింద ఆర్థిక సహాయం అందుతుందా? మళ్లీ ఇందిరమ్మ పథకానికి దరఖాస్తు చేసుకోవాలా? ఈ సందేహాలకు సంబంధించి శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహలక్ష్మీ పథకం, ఆ పథకం కింద కలెక్టర్లు జారీ చేసిన శాంక్షన్ ఆర్డర్స్ రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది.
![gruhalakshmi scheme and guidelines rescinded, collectors sanction orders cancelled by revanth reddy government kms gruhalakshmi scheme and guidelines rescinded, collectors sanction orders cancelled by revanth reddy government kms](https://static-ai.asianetnews.com/images/01gpt0jax4yhztmxfpm5bhg2cc/untitled_363x203xt.jpg)
Gruhalakshmi Scheme: కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఆత్మగౌరవంతో బతకాలని చెబుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని తెచ్చారు. అయితే, ఆ పథకం లబ్దిదారులందరికీ దక్కే పరిస్థితులు లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల ముంగిట కొత్తగా గృహలక్ష్మీ పథకాన్ని ప్రకటించారు. ఇంటి స్థలం ఉన్నవారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది జూన్, జులై మాసాల కాలంలో పెద్ద మొత్తంలో దరఖాస్తులు అందాయి. మీ సేవ, ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల చుట్టూ ఈ దరఖాస్తుల కోసం చక్కర్లు కొట్టారు.
ప్రభుత్వం 4 లక్షల ఇళ్లను గృహలక్ష్మీ పథకం కింద అందజేయాలని శాంక్షన్ చేసింది. వంద శాతం సబ్సిడీతో రూ. 3 లక్షలు లబ్దిదారులకు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరిగింది. జిల్లా కలెక్టర్లు 2,12,095 మంది లబ్దిదారులకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా జిల్లా కలెక్టర్లు శాంక్షన్ ఆర్డర్లు కూడా జారీ చేశారు.
ఇంతలో నవంబర్లో ఎన్నికలు వచ్చాయి. డిసెంబర్లో వెలువడిన ఫలితాల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరింది. దీంతో ఈ పథకం కొనసాగిస్తారా? లేక రద్దు చేస్తారా? అనే సందిగ్దం ఏర్పడింది. అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందని ప్రకటించింది. మరి ప్రొసీడింగ్స్ కూడా వచ్చిన గృహలక్ష్మీ ఇళ్ల పరిస్థితి ఏమిటీ? అనే ఆందోళనకర సంశయం వెంటాడింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకుంది. శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు గ్యారంటీల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిరుపేదలకు వారి సొంత స్థలంలో లేదా.. ప్రభుత్వమే ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం.. గతంలో ప్రకటించిన గృహలక్ష్మీ పథకాన్ని నిలిపేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కలెక్టర్లు జారీ చేసిన మంజూరు పత్రాలనూ రద్దు చేయాలని స్పష్టం చేసింది. కాబట్టి, ఆ పథకం గైడ్లైన్స్ కూడా రద్దవుతాయని వివరించింది. తెలంగాణ స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అవసరమైన తదుపరి చర్యలను తీసుకుంటారని డిసెంబర్ 30వ తేదీన విడుదలైన ఆదేశాలు వెల్లడించాయి.