తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. రాజభవన్ రాజకీయ అడ్డా కాదని ఆమె అన్నారు.

హైదరాబాద్: తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ధన్వంతరి అవార్డు వచ్చిన తమిళిసై భర్త సౌందరరాజన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సన్మానించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కెసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ తమిళిసై ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తాను ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తమిళిసై చెప్పారు. గత నాలుగు నెలలుగా రాజభవన్ అదే విధానాన్ని అనుసరిస్తోందని ఆమె అన్నారు. రాజభవన్ రాజకీయాలకు అడ్డా కాదని ఆమె అన్నారు. రాజభవన్ కు రాజకీయాలు ఆపాదించడం మంచిది కాదని అన్నారు. ఈ మెయిల్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఫిర్యాదులు చేయవచ్చునని ఆమె అన్నారు. 

తెలంగాణలో కరోనా వైరస్ అదుపులో ఉందని, రికవరీ రేటు బాగుందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యల వల్లనే కరోనా వైరస్ రాష్ట్రంలో అదుపులో ఉందని ఆమె అన్నారు. తెలంగాణ రైస్ బౌల్ గా ఉండడం గర్వకారణమని ఆమె అన్నారు. 

తాను డాటర్ ఆఫ్ తమిళనాడు, సిస్టర్ ఆఫ్ తెలంగాణ అని ఆమె అన్నారు. త్వరలోనే తాను తెలుగు నేర్చుంటానని తమిళిసై చెప్పారు. 

చలో రాజభవన్ చేపట్టిన కాంగ్రెసు నేతలను పోలీసులు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే. రాజభవన్ కు వెళ్లకుండా వారిని నిరోధించారు. ఆ సమయంలో తమిళిసై మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కోవిడ్ కారణం చెప్పి తమిళిసై తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, తమకు అడ్డువచ్చిన కోవిడ్ కేసీఆర్ కు అడ్డు రావడం లేదా అని ఆయన అన్నారు.