తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. గవర్నర్ తమిళిసై సంచలన ట్వీట్...
‘సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు గవర్నర్ తమిళిసై.
సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినమా? విలీనమా? విద్రోహమా? ఈ మూడింటి మీద ఎవరి వాదన వారిదే. బీజేపీ మాత్రం ఇది విమోచనమే అంటోంది. ఆ వాదనను మిగిలిన పక్షాలు తప్పు పడుతున్నాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.
‘సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు తమిళిసై. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్ లో పేర్కొన్నారు గవర్నర్.
మరోవైపు టీఆర్ఎస్ మాత్రం సెప్టెంబర్ 17ను విలీన దినమంటోంది. పార్టీ ఆఫీస్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు సెక్రటరీ జనరల్ కేశవరావు. వివాదాలకు ముగింపు పలికి విలీన దినోత్సవం చేసుకోవాలని పిలుపునిచ్చారాయన.