ప్రభుత్వ ఉపాధ్యాయున్ని అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం : ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. పాఠశాలకు వెళుతుండగా ఉపాధ్యాయుడి బైక్ ను కారుతో ఢీకొట్టారు దుండగులు. కిందపడిపోయిన టీచర్ ను గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా హతమార్చారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కూసుమండి మండలం నాయకన్ గూడెంకు చెందిన మారోజు వెంకటాచారి(49)ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఇతడు పిఈటిగా పనిచేస్తున్నాడు. అయితే నిన్న(బుధవారం) ఉదయం ఎప్పటిలాగే తన స్వగ్రామం నుండి పాఠశాలకు బయలుదేరాడు వెంకటాచారి. కానీ మార్గమధ్యలో అతడిని అత్యంత దారుణంగా హత్యచేసారు దుండగులు.
వెంకటాచారి కోసం నాయకన్ గూడెం శివారులో ముందుగానే కాపుకాసారు దుండగులు. బైక్ పాఠశాలకు బయలుదేరిన అతడు ఊరి బయటకు రాగానే దుండగులు కూడా కారులో రెడీ అయ్యారు. కారును వెంకటాచారి బైక్ పైకి వేగంగా పోనిచ్చి ఢీకొట్టారు. దీంతో ఉపాధ్యాయుడు కిందపడిపోగా కారులోని వారు కిందకుదిగారు. మరొకడు అక్కడికి బైక్ పై గొడ్డలితో వచ్చి వెంకటాచారి మెడపై వేటు వేసాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా దుండగులు అక్కడినుండి పరారయ్యారు.
Read More భార్యపై వివాహేతర సంబంధం అనుమానం.. ఉరివేసుకుని భర్త ఆత్మహత్య..
వెంకటాచారి హత్యను పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు కళ్ళారా చూసారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
ప్రభుత్వ టీచర్ ను చంపిన దుండుగుల ఎరుపు రంగు కారులో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఆ మార్గంలోని సిసి కెమెరాలను పరిశీలించగా ఓ ఎరుపు కారు, దాని వెనకాలే బైక్ వెళుతుండగా పోలీసులు గమనించారు. వీరే హంతకులై వుంటారని భావించి కారు వివరాలను తెలుసుకుని దుండగులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆర్థిక వ్యవహారాలే వెంకటాచారి హత్యకు కారణమై వుంటుందని అనుమానిస్తున్నారు. దుండుగల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
