జిహెచ్ఎంసీ ఎన్నికలు: బిజెపిలో చేరిక వార్తలపై కొండా విశ్వేశ్వర రెడ్డి స్పందన
కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రచారంపై కొండా విశ్వేశ్వర రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు అన్ని పార్టీల్లోనూ మిత్రులున్నారని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి బిజెపి నేతలు గాలం వేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొండా విశ్వేశ్వర రెడ్డిని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్సి భూపేంద్ర యాదవ్ కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర రెడ్డిని బిజెపి నేతలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పుకార్లు షికారు చేశాయి.
తనపై జరుగుతున్న ప్రచారంపై కొండా విశ్వేశ్వర రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పష్టత ఇచ్చారు. ఆది పుకారు మాత్రమేనని, తనకు టీఆర్ఎస్, ఎంఐఎఁ, బిజెపిలతో పాటు అన్ని పార్టీల్లోనూ తనకు మిత్రులు, పరిచయస్తులు ఉన్నారని ఆయన చెప్పారు.
Also Read: జిహెచ్ఎంసీ ఎన్నికలు: చక్రం తిప్పుతున్న భూపేంద్ర యాదవ్, కొండాతో భేటీ?
తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుుగుతున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందని, అది పుకారు మాత్రమేనని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డిని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కలిసినట్లు వార్తలు వచ్చాయి.
జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ బిజెపి నేతలు వివిధ పార్టీల నాయకులను కలిసి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ బిజెపిలో చేరడానికి సిద్ధపడ్డారు. మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి ఇప్పటికే బిజెపిలో చేరారు.