అనుకున్నంతా జరుగుతోంది..!! వైఎస్ జగన్ ఇంటివద్ద అక్రమాల కూల్చివేత..
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమితో తెలంగాణలోనూ వైఎస్ జగన్ కు కష్టాలు తప్పడంలేదు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగానే అధికారులను రంగంలోకి దింపారు...
![GHMC demolishes Ilegal constructions outside of YS Jagan house in Hyderabad AKP GHMC demolishes Ilegal constructions outside of YS Jagan house in Hyderabad AKP](https://static-ai.asianetnews.com/images/01hx1yskk39ajccxzzt8zd9rth/tse-jcb_363x203xt.jpg)
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైం బాగాలేనట్లుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో చావుదెబ్బ తిని అధకారాన్ని కోల్పోయారు జగన్. ఈ షాక్ నుండి ఇంకా బయటపడకముందే తెలంగాణ ప్రభుత్వం కూడా మరో షాక్ ఇచ్చింది. రాజధాని హైదరాబాద్ లో వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ ముందు అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ఈ మేరకు జెసిబిలతో లోటస్ పాండ్ వద్దకు చేరుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేసారు.
జూబ్లీహిల్స్ లోని వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపడుతున్నారని...దీనివల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయని జిహెచ్ఎంసి సిబ్బంది గుర్తించారు. దీంతో ఇవాళ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి లోటస్ పాండ్ వద్దకు చేరుకున్న అధికారులు కొత్తగా నిర్మించిన నాలుగు గదులను కూల్చివేసారు.
లోటస్ పాండ్ వద్ద కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. సామాన్య ప్రజలు ఫిర్యాదులతో పాటు వాహనదారుల ఇబ్బందులను గమనించే అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పూనుకున్నట్లు జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ లోటప్ పాండ్ వద్ద కూల్చివేతలపై జగన్ కుటుంబసభ్యులు గానీ, వైసిపి నాయకులు గాని స్పందించడంలేదు.
చంద్రబాబు ఎఫెక్టేనా?
ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ఓటమి తర్వాత రాజకీయ కక్షసాధింపులు వుంటాయని అందరూ ఊహించారు. గత ఐదేళ్లు చంద్రబాబు నాయుడినే కాదు ఆయన కుటుంబాన్ని, టిడిపి నాయకులను జగన్ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టింది. అనేక మంది నాయకులపై కేసులు పెట్టి జైలుకి పంపింది... చివరకు చంద్రబాబును కూడా వదిలిపెట్టలేదు. కొన్ని నెలల పాటు ఆయనను సెంట్రల్ జైల్లో బంధించారు.
అయితే అధికారంలోకి రాగానే జగన్ భరతం పడతామని ఎప్పటినుండో టిడిపి నాయకులు హెచ్చరిస్తున్నారు. స్వయంగా నారా లోకేష్ రాబోయే టిడిపి ప్రభుత్వం గతంలో మాదిరిగా వుండదని... అంతకంతా రివేంజ్ తీర్చుకుంటామన్నారు. అంతేకాదు టిడిపి వాళ్లను వేధించిన నాయకులు, అధికారుల పేర్లను నోట్ చేసుకోడానికి అంటూ ఓ రెడ్ బుక్ ను మెయింటైన్ చేసారు. అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్ లో పేరు ఎక్కినవారు ఎక్కడికి పారిపోయినా వదిలిపెట్టబోమని లోకేష్ హెచ్చరించారు.
చంద్రబాబు నాయుడు కూడా వైసిపి నాయకుల అవమానాలతో విసిగి వేసారిపోయారు. అందువల్లే ఆయన కూడా వైసిపి నాయకులు, వైఎస్ జగన్ ను ఊరికే వదిలిపెట్టరని టిడిపి నాయకులే అభిప్రాయపడ్డారు. చివరకు తెలంగాణకు పారిపోయానా జగన్ కష్టాలు తప్పవని... అక్కడ సీఎంగా వున్నది చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డేనని టిడిపి నేతలు అన్నారు. వాళ్లు అన్నట్లుగానే ప్రస్తుతం జరుగుతోంది.
ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మకాం హైదరాబాద్ లేదంటే బెంగళూరుకు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆయన నివాసం లోటస్ పాండ్ వద్ద భద్రతను మరింత పెంచేందుకు బయట నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కానీ ఇవి అక్రమ నిర్మాణాలంటూ జిహెచ్ఎంసి అధికారులు కూల్చేస్తున్నారు.