ధరూర్ సెంటిమెంట్: అక్కడ లీడ్ వస్తే ఎమ్మెల్యేనే
ఉమ్మడి మహాబూబ్నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ధరూరు మండలంలో ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థికి మెజారిటీ వస్తే వాళ్లే విజయం సాధిస్తున్నారు.
గద్వాల: ఉమ్మడి మహాబూబ్నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ధరూరు మండలంలో ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థికి మెజారిటీ వస్తే వాళ్లే విజయం సాధిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధరూర్ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చింది. సంప్రదాయానికి అనుగుణంగా గద్వాల నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు.
1957 నుండి ధరూర్ మండలంలో ఏ పార్టీ అభ్యర్ధికి మెజారిటీ వస్తే వాళ్లే విజయం సాధిస్తున్నారు. 1952లో గద్వాల నియోజకవర్గానికి ద్విసభ్య నియోజకవర్గానికి తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డికె సత్యారెడ్డి విజయం సాధించారు.
ధరూర్ మండలంలో వచ్చిన మెజారిటీ కారణంగానే సత్యారెడ్డి విజయం సాధించారు.సత్యారెడ్డి కొడుకులు డికె సమరసింహారెడ్డి, భరతసింహారెడ్డితో పాటు మాజీ మంత్రి డికె అరుణ కూడ ధరూరులో వచ్చిన మెజారిటీ కారణంగానే విజయం సాధించారు.
డికె అరుణపై కృష్ణమోహన్ రెడ్డికి ఈ మండలంలో 6,978 ఓట్ల ఆధిక్యం లభించింది.2004 ఎన్నికల్లో డీకె అరుణకు ఈ మండలంలో టీడీపీ అభ్యర్ధి గట్టు భీముడిపై 5 వేల మెజారిటీ, 2009లో 3,634 ఓట్ల మెజారిటీ, 2014 లో1453 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ ఈ దఫా ఈ మండలంలో కృష్ణమోహన్ రెడ్డికి ఆధిక్యం వచ్చింది.
2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. 2014లో, ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్ధిగా కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. గత రెండు దఫాలు కృష్ణమోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ దఫా గద్వాల ప్రజలు కృష్ణమోహన్ రెడ్డిని ఆదరించారు.