తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. MRO ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్న సాఫ్రాన్ గ్రూప్.. కేటీఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందకొచ్చింది. ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్లో తన MRO ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందకొచ్చింది. ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లు, రాకెట్ ఇంజన్లతో పాటు వివిధ ఏరోస్పేస్, డిఫెన్స్ సంబంధిత పరికరాలు, వాటి భాగాలను.. రూపకల్పన, అభివృద్ధి, తయారీ చేసే ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్లో తన MRO ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది $ 150 మిలియన్ల (దాదాపు రూ. 1,185 కోట్లు) ప్రారంభ పెట్టుబడితో హైదరాబాద్కు రానుంది. సఫ్రాన్ గ్రూప్ రాకతో.. ఏరోస్పేస్, రక్షణ కార్యకలాపాలకు కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
అయితే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలని Safran Group తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో తన మెగా ఏరో ఇంజిన్ MRO కోసం హైదరాబాద్ను ఎంచుకోవాలని సాఫ్రాన్ గ్రూప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. హైదరాబాద్లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దది అని తెలిపారు. భారతదేశంలో గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారు (OEM) ద్వారా ఏర్పాటు చేసే మొదటి ఇంజన్ MRO అవుతుందన్నారు.
ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ ద్వారా ప్రారంభ పెట్టుబడి దాదాపు 150 మిలియన్ డాలర్లు ఉంటుందని చెప్పారు. 800 నుంచి 1000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారబోతుందని కేటీఆర్ చెప్పారు.