నిన్న రాత్రి మొయినాబాద్ ఫాంహౌస్ నుండి వచ్చిన నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి  భవన్ లోనే ఉన్నారు. ఈ ఘటనపై టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్: మొయినాబాద్ ఫాం హౌస్ నుండి బుధవారంనాడు రాత్రి ప్రగతి భవన్ కు చేరుకున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా అక్కడే ఉన్నారు. తమను పార్టీ మారితే పెద్ద ఎత్తున డబ్బులు,. కాంట్రాక్టులు ఇస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా మొయినాబాద్ ఫాం హౌస్ పై పోలీసులు దాడి చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సమయంలో ఎమ్మెల్యేలతో పాటు ఉన్నమరో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహభారతి,హైద్రాబాద్ కు చెందిననందకుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు ఫాం హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిన్న రాత్రి మీడియాకు చెప్పారు.

నిన్న రాత్రి మొయినాబాద్ ఫాం హౌస్ నుండి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు కారులో ప్రగతి భవన్ కు చేరుకున్నారు. గువ్వల బాలరాజు స్వయంగా కారును నడుపుకుంటూ ప్రగతి భవన్ కు తన వాహనాన్ని తీసుకువచ్చారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తర్వాత పోలీసుల రక్షణతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతిభవన్ కు చేరుకున్నారు.

నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వచ్చిన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా ప్రగతి భవన్ కు చేరుకుకున్నారు. కేసీఆర్ ,కేటీఆర్, హరీష్ రావులతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. నిన్న రాత్రి నుండి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లోనే ఉన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

alsoread:ఆపరేషన్ ఆకర్ష్ : ఫోన్లలో ఎవరితో మాట్లాడించాలనుకున్నారు? అవతలి వ్యక్తులు ఎవరు??

తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది.డబ్బులతో ఎమ్మెల్యేలను పిరాయింపు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ప్రగతి భవన్ కేంద్రంగా కేసీఆర్ డ్రామా నడిపారన్నారు.ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు ఎలా వెళ్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.