పండగపూట విషాదం... గోదావరి నదిలో నలుగురు యువతులు గల్లంతు
శనివారం మద్యాహ్నం నలుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతవగా స్థానికులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.
వరంగల్: గోదావరి నదిలో సరదాగా ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయిన విషాద సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం మద్యాహ్నం యువకులు నదిలో గల్లంతవగా స్థానికులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. దీంతో రాత్రివరకు రెండు మృతదేహాలు మాత్రమే లభించాయి.
వివరాల్లోకి వెళితే... ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన యువకులు కార్తిక్, అన్వేష్, శ్రీకాంత్, ప్రకాష్ స్నేహితులు. వీరంతా దిపావళి పండగ సందర్భంగా కలుసుకుని సరదాగా గడపడానికి గోదావరి నదిలో ఈతకు వెళ్లారు. అయితే నదీప్రవాహం ఎక్కువగా వుండటంతో ఈతకు దిగిన నలుగురు గల్లంతయ్యరు.
స్థానికులు అందించిన సమాచారంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళ సాయంతో గాలింపు చేపట్టారు. రాత్రివరకు వెతకగా ఇద్దరు యువకుల మృతదేహాలు లభించాయి. మిగతా ఇద్దరు యువకుల కోసం ఆదివారం గాలింపు కొనసాగుతోంది.