కాంగ్రెస్లోకి డీఎస్ ఖాయం: ఆయనతో పాటు నందీశ్వర్ గౌడ్
డీఎస్తో పాటే కాంగ్రెస్లోకి నందీశ్వర్గౌడ్
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైనట్టు ప్రచారం సాగుతోంది. డీఎస్కు సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ను కూడ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడ డీఎస్ కోరినట్టు సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నందీశ్వర్గౌడ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్కు డీఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయి. డీఎస్ అనుచరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. డీఎస్ టీఆర్ఎస్లో చేరిన తర్వాత నందీశ్వర్గౌడ్ బీజేపీలో చేరారు.
టీఆర్ఎస్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బుధవారం నాడు డీఎస్ నిజామాబాద్లో అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు.
ఇవాళ ఉదయమే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డీఎస్పై విమర్శలు చేయడమే కాకుండా ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడ కోరుతూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఈ తరుణంలో డీఎస్ అనుచరులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
సీఎంకు రాసిన లేఖలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డీఎస్కు నిప్పులు చెరిగారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. డీఎస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం గమనార్హం.
తనతో పాటు నందీశ్వర్ గౌడ్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళేందుకు డీఎస్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై వీరిద్దరూ కూడ నోరు విప్పలేదు. తన అనుచరులతో సమావేశం ముగిసిన తర్వాత డీఎస్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
డీఎస్తో పాటు నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు పటాన్ చెరువు టిక్కెట్టును కోరినట్టు సమాచారం. దీనికితోడు తన కొడుకుకు మెదక్ టిక్కెట్టును కూడ ఇవ్వాలని అడిగారని సమాచారం.అయితే ఈ విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.