రాజకీయ లబ్దికోసమే జల జగడం, ఆ గెజిట్ రాయలసీమకు నష్టం: మైసూరారెడ్డి
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధులోకి తీసుకురావడం రాయలసీమకు తీవ్రమైన నష్టం చేస్తోందని మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు.బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కూర్చొని ఈ విషయాలపై చర్చించాలని ఆయన సూచించారు.విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా నీటిని వాడుకోవద్దని ఆయన కోరారు. ఇష్టం వచ్చినట్టుగా నీటిని తోడేస్తే రెండు రాష్ట్రాలకు ఇబ్బందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:సుదీర్ఘ కసరత్తు చేశాకే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు: కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ
కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను స్వాగతించే ముందు ఏపీ సర్కార్ ఆలోచించాలని ఆయన కోరారు.కృష్ణా జలాల వివాదం ఏపీ సమగ్రతకు మంచిది కాదన్నారు. గతంలో జల వివాదాలను ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకొన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఇద్దరు సీఎంలు రాజకీయ లబ్ది కోసం ఘర్షణ పడుతున్నారని ఆయన మండిపడ్డారు.కేంద్రం చేతిలో పిలకను పెట్టి గ్రేటర్ సీమ ప్రాజెక్టుల మనుగడను గందరగోళంలోకి నెట్టారని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదన్నారు.