తెలంగాణను వదిలి నష్టపోయా, ఇక్కడికే వస్తా: కేటీఆర్ తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన సీఎల్పీలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. జానారెడ్డి ఓడిపోతాడని తాను ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.
హైదరాబాద్: తెలంగాణను వదిలేసి చాలా నష్టపోయాయని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. అంతకుముందు సీఎల్పీలో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలౌతారని తాను ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికి తెలుసునని ఆయన చెప్పారు.సీఎం కేసీఆర్ ను కలవడానికి తాను హైద్రాబాద్ కు వచ్చినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. రాజకీయాలు బాగా లేవు. సమాజం కూడ బాగా లేదన్నారు. ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేసీ దివాకర్ రెడ్డి సోదరులు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా నుండి జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి నుండి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డిలు అనంతపురం, తాడిపత్రి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు.