హరీష్రావును దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్లాన్: డికె అరుణ
హరీష్ రావును దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. ఉద్దేశ్యపూర్వకంగానే కేసీఆర్ ఇలా వ్యవహరించాడని ఆమె ఆరోపించారు.
హైదరాబాద్: హరీష్ రావును దెబ్బతీసేందుకే చింతమడకకు కేసీఆర్ వరాలు కురిపించారని మాజీ మంత్రి డికె అరుణ ఆరోపించారు. హరీష్ రావును టార్గెట్ గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
గురువారం నాడు ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీపై తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని డికె అరుణ చెప్పారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీజేపీలో చేరలేదని డికె అరుణ చెప్పారు. జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలోకి వెళ్లిన ఒరిగేదేమీ లేదన్నారు.
టీఆర్ఎస్ నేతల భూములు ఉన్న చోటే ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారని డికె అరుణ ఆరోపించారు. నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి విమర్శించారు.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు డికె అరుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.