అధికార లాంఛనాలతో చందూలాల్ అంత్యక్రియలు: సీఎస్ కు కేసీఆర్ ఆదేశం
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత అజ్మీరా చందూలాల్ కు 67ఏళ్ల వయసులో కరోనా సోకడంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.
కరోనా వైరస్ బారినపడ్డి చందూలాల్ మూడు రోజుల కిందట హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.
read more మాజీ మంత్రి చందూలాల్ ను మింగేసిన కరోనా వైరస్
మాజీ మంత్రి చందూలాల్ మృతిపై పలువురు మంత్రులు కూడా ఆవేధన వ్యక్తం చేశారు.ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు చందూలాల్ కరోనా తో మృతి చెందడం బాధాకరమన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన తనకు చిరకాలంగా మంచి మిత్రుడని... రాజకీయంగా కలిసి చాలా కాలం పని చేశామని గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో చందూలాల్్ ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటన్నారు ఎర్రబెల్లి.
మరో ఇంద్రకరణ్ రెడ్డి కూడా చందూలాల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు సద్గతులు కలగాలని మంత్రి ప్రార్థించారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చందూలాల్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు విశేష సేవలందించారన్నారు. రాష్ట్ర తొలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కేసీఆర్ క్యాబినేట్లో పనిచేసి గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేశారని ఆయన సేవలను ఈ సందర్భంగా వేముల గుర్తు చేసుకున్నారు.