ప్రతీకారం, నగ్నంగా చేసి దాడి.. ఐదుగురు మహిళలు అరెస్ట్..!
ఇటీవల సదరు మహిళ బెయిల్ పై విడుదలై బయటకు వచ్చింది. ఆ తర్వాత సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంది.
ఓ హత్య కేసులో నిందితురాలి పై బాధిత కుటుంబం దారుణంగా ప్రవర్తించింది. అందరి ముందు ప్రతీకారం తీర్చుకుంది. అందరూ చూస్తుండగానే.. మహిళలను వివస్త్రను చేసి.. కర్రలతో చితకొట్టారు. అనంతరం ఆమె కళ్లల్లో కారం కూడా కొట్టారు. సూర్యాపేటలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట మండలం రాజునాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ జూన్ 13వ తేదీన హత్యకు గురయ్యారు. ఆ ఊరికి చెందిన ఓ మహిళ ఈ హత్య కేసులో అరెస్టు అయ్యారు. శంకర్ నాయక్ బంధువులతో ఆమెకు పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా.. ఇటీవల సదరు మహిళ బెయిల్ పై విడుదలై బయటకు వచ్చింది. ఆ తర్వాత సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంది.
రాజునాయక్ తండాకు చెందిన బంధువొకరు చనిపోవడంతో శనివారం ఆమె అక్కడకు వెళ్లారు. శంకర్ నాయక్ హత్యానంతరం మొదటిసారి తండాకు వచ్చిన ఆమెను చూసి మృతుడి బంధువులు రెచ్చిపోయారు. ఆమెపై దాడి చేశారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దారుణంగా కొట్టారు.
నగ్నంగా వీధుల్లో తిప్పారు. దాదాపు గంటపాటు ఆమెను నగ్నంగా తిప్పారు. అయినా ఎవరూ ఈ దారుణాన్ని అడ్డుకోకపోవడం గమనార్హం. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న సదరు మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు బాధతురాలిపై దాడి చేసిన ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.