సంగారెడ్డి జిల్లాలో ఘోరప్రమాదం: కారు,లారీ ఢీ...ఐదుగురు మృతి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చౌటకూరు వద్ద కారును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం చౌటకూరులో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. కారును లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.కారులో సంగారెడ్డి నుండి మెదక్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతుల్లో ఇద్దరు మహిళలు సహా ఆరేళ్ల చిన్నారి కూడ ఉన్నారు. మరో ఇద్దరు పురుషులు కూడ ఈ ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తేలుస్తోంది.
మెదక్ జిల్లా రంగంపేట కు చెందిన పద్మ, దాస్ భార్యాభర్తలు. వీరి కొడుకుకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. రంగంపేట నుండి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్న తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ కారులోని ఇద్దరు ఎవరనే విషయమై ఇంకా ఆచూకీ తెలియాల్సి ఉంది.అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.