ఫెడరల్ ఫ్రంట్: చంద్రబాబుతో కేసీఆర్ ఢీ
తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల్ల చూపు దేశ రాజకీయాలపై పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఇద్దరు చంద్రుళ్లు తహతహలాడుతున్నారు. ఒకరేమో కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తుంటే, మరొకరేమో బీజేపీ యేతర ఫ్రంట్ కోసం ఇంకా చెప్పాలంటే యూపీఏ దాని మాత్రపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేశ రాజకీయాల్లో ఇద్దరిలో ఎవరు చక్రం తిప్పుతారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల్ల చూపు దేశ రాజకీయాలపై పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఇద్దరు చంద్రుళ్లు తహతహలాడుతున్నారు. ఒకరేమో కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తుంటే, మరొకరేమో బీజేపీ యేతర ఫ్రంట్ కోసం ఇంకా చెప్పాలంటే యూపీఏ దాని మాత్రపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేశ రాజకీయాల్లో ఇద్దరిలో ఎవరు చక్రం తిప్పుతారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కేసీఆర్ చంద్రబాబు నాయుడు కంటే కాస్త ముందు వరుసలోనే ఉన్నారు. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కోసం జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ అని చెప్పాలి.
తాను థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతానని ప్రకటించిన కేసీఆర్ వెనువెంటనే రంగంలోకి దిగారు. ప్రాంతీయ పార్టీల సత్తా చూపించాలనే ఉద్దేశంతో ముందుగా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసే ప్రయత్నం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కోరారు.
ముందుగా తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై చర్చించారు. మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత కర్ణాటక సీఎం కుమార స్వామిని కలిశారు. మాజీ ప్రధానిమంత్రి దేవెగౌడతో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో జరగుతున్న పరిణామాలపై చర్చించారు.
అలాగే పశ్చిమబంగ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కూడా కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కోరారు. ఆ తర్వాత ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించారు.
అంటే ఒక దఫా జాతీయ నేతల్లో కదలిక తీసుకువచ్చారు కేసీఆర్. దేశ రాజకీయాల్లో తాను చేపట్టబోయే యజ్ఞం విజయవంతం కావాలంటే ఇంట గెలవాలని భావించిన కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
ముందస్తు ఎన్నికల్లో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి స్నేహ హస్తం అందించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కరే ఒకపైపు ఉంటే మరోవైపు చంద్రబాబు నాయుడు అండ్ టీం కలిసి ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. కేసీఆర్ ను గద్దె దించాలని ప్రయత్నించి అసలుకే ఎసరు తెచ్చుకున్నాయి.
గులాబీ బాస్ను ఓడించేందుకు ప్రజాకూటమి చేసిన ప్రయత్నాలు ఏపీ ఫలించలేదు. బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ పై కాదని చంద్రబాబుపై గెలుపు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.
ఇప్పటి వరకు దేశ చరిత్రలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన వారు చాలా అరుదు. అయితే ఆ సెంటిమెంట్ ను బలమైన మెజారిటీతో చెరిపేశారు గులాబీ దళపతి కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేతగా కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒక అట్రాక్షన్ అయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
తెలంగాణా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ మరింత దూకుడు పెంచారు. ఇక సీఎంగా ఉంటూనే దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగా తనయుడు కేటీఆర్ను వారసుడిగా ప్రకటించి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్గా ఎంపిక చేసి పార్టీ బాధ్యతలు అప్పగించారు.
పార్టీ బాధ్యతలు తనయుడికి అప్పగించడంతో ఎక్కువ సమయం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ దొందూ దొందేనని వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శలతో విరుచుకుపడ్డారు కేసీఆర్.
ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా చిన్ని చిన్న పార్టీలను కలుపుకొని ఫెడరల్ ప్రంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గతంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్తో ప్రత్యేకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమైన సీఎం కేసీఆర్ ఇప్పటికే మెుదటి దఫాగా పలువురితో చర్చలు సైతం జరిపారు. అయితే ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి మంచి దూకుడు మీదున్న కేసీఆర్ మరింత జోరు పెంచేందుకు రెడీ అవుతున్నారు.
ఇకపోతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కలసి దేశ వ్యాప్తంగా ఫెడరల్ ప్రెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఉన్న మైనారిటీలను అనుకూలంగా మలుచుకునేందుకు హైదరాబాద్ నగరం నుంచే పావులు కదపాలని ప్రయత్నిస్తున్నారు. కేబినేట్ కూర్పుు అయిపోయిన వెంటనే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే తెలంగాణా ఎన్నికల్లో కూటమి ఘోరంగా ఓడిపోవడంతో దాని ప్రభావం బాబుపై పడిందని చెప్పాలి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న బాబుకు ఎన్నికల ఫలితాలు కాస్త నష్టాన్ని కలిగించాయి.
తెలంగాణ ఎన్నికల వ్యూహరచన అంతా చంద్రబాబుదే అన్నట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు ఆలోచనలతోనే కాంగ్రెస్ పయనించి బొక్క బోర్లా పడిందని ఆపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేసినా, చంద్రబాబే ప్రధానంగా ప్రజలకు కనిపించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాహుల్ గాంధీ కంటే చంద్రబాబునే టార్గెట్ చేశారు. ఒకానొక దశలో ముందస్తు ఎన్నికలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్య కాదని కేసీఆర్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్నాయా అన్నంతగా ఎన్నికల సమరం సాగింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబునాయుడుతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పయనిస్తారా అన్నది సందేహంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో పక్కనే కూర్చుని అంతా చూసిన రాహుల్ గాంధీ తీరా ఫలితాలు వచ్చేసరికి బెడిసి కొట్టడంతో చంద్రబాబుపై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితి లేకపోలేదు.
తమిళనాడులో డీఎంకే వ్యవస్థాప అధ్యక్షుడు కరుణానిధి విగ్రహావిష్కరణలో రాహుల్ గాంధీ, చంద్రబాబులు ఒకే వేదిక పంచుకున్నప్పటికీ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు.
చంద్రబాబును నమ్ముకుని సొంత అస్త్రాలను వదలడం మరచిపోయామని అందుకు ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్తున్నారు. అంతేకాదు చంద్రబాబుతో పొత్తు అంతమంచిది కాదని కూడా హితవు పలుకుతున్నారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు జాతీయ రాజకీయాలపై నీలినీడలు అలుముకున్నాయని చెప్పవచ్చు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబును ముందుకు నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని పలు పార్టీలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇదే విషయంపై పలువురి దగ్గర అన్నట్లు తెలుస్తోంది.
మమత బెనర్జీ బాటలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీఎస్పీ నేతలు ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లు పయనిస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ యేతర కూటమి సమావేశానికి వీరు హాజరుకాలేదని తెలుస్తోంది.
అంతేకాదు కాంగ్రెస్ సీఎంల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారోత్సవానికి కానీ, తమిళనాడులో కరుణానిధి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కానీ హాజరుకాకపోవడానికి కారణం అదేనని భావిస్తున్నారు.
ఇదే నిజమైతే చంద్రబాబు నాయకత్వాన్ని ఉత్తరాది నేతలు అంగీకరించడం కష్టమేనని భావించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నేతృత్వంలో బీజేపీ యేతర కూటమికి నడవడం సాధ్యమా అన్న ప్రచారం కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో బొక్క బోర్లా పడటంతో అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏపీ రాజకీయాలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు చంద్రబాబును వెంటేసుకుని జాతీయ రాజకీయాలు చేసేందుకు రాహుల్ ఇష్టపడతారా అన్న సందేహం కూడా నెలకొంది.
మెుత్తానికి ముందస్తు ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఇంట గెలిచా రచ్చ గెలుస్తా అంటూ ముందుకు దూసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు తాను ఇంటగెలిచి రచ్చ గెలిచేందుకు వస్తా అంటున్నారు. మెుత్తానికి జాతీయ రాజకీయాల్లో ఇద్దరు చంద్రుల్లో ఎవరు చక్రం తిప్పుతారో అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.